కందనూలు: జిల్లాలో గృహ అవసరాలకు వినియోగించే వంటగ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటారని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శనివారం కలెక్టరేట్లో గ్యాస్ సరఫరాపై అదనపు కలెక్టర్ అమరేందర్తో కలిసి గ్యాస్ ఏజెన్సీల డీలర్లు, సేల్స్ ఆఫీసర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులు, డీటీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనే సేవాభావంతో పనిచేయాలన్నారు. జిల్లాలోని 17 గ్యాస్ ఏజెన్సీల ద్వారా రోజువారి పంపిణీ ప్రక్రియ, నిల్వ తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఎల్పీజీ డీలర్ల దగ్గర బుకింగ్ స్టాక్, సరఫరాపై ప్రతిరోజు రిపోర్ట్ సమర్పించాలని ఆదేశించారు. జిల్లా ప్రజలు ఆందోళన చెందవద్దని, ఎల్పీజీ గ్యాస్కు ఎలాంటి కొరత లేదని చెప్పారు. ఆస్పత్రులు, వసతి గృహాలు, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు వంటి సంస్థలకు ప్రభుత్వ నిబంధనల మేరకు సరఫరా చేయాలని సూచించారు. ఎవరైనా కృత్రిమ కొరత సృష్టించి, బ్లాక్ మార్కెట్లో సిలిండర్లు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న డొమెస్టిక్ సిలిండర్లను వ్యాపార, వాణిజ్య దుకాణాల నుంచి స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేయాలన్నారు. ఆస్పత్రుల్లో ఇన్ పేషెంట్ల సంఖ్యకు అనుగుణంగానే సిలిండర్లు ఇండెంట్ పెట్టేలా కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేయాలన్నారు. సమావేశంలో డీఎస్డీఓ నర్సింహారావు, సివిల్ సప్లయ్ డీఎం రాజేందర్, పెట్రోలియం సంస్థల అధికారులు, గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో గృహ అవసరాలకు
ఎలాంటి ఇబ్బంది లేదు
విపత్కర పరిస్థితుల్లో సేవాభావంతో పనిచేయండి
కలెక్టర్ బదావత్ సంతోష్


