కార్మికుల వేతన వెతలు
● పంచాయతీలో కార్మికులకు 4 నెలలు అందని వేతనాలు
● పట్టించుకోని అధికారులు
● సమ్మె తప్పదంటున్న కార్మికులు
అచ్చంపేట రూరల్: పంచాయతీల్లో పారిశుద్ధ్య పనులు చేసే కార్మికులకు నాలుగు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన చెందుతున్నారు. కొత్తగా పాలక వర్గాలు ఏర్పడ్డా.. తమ సమస్యలు తీరడం లేదని వాపోతున్నారు. రోజురోజుకూ పనిభారం పెరుగుతున్నా ప్రజాప్రతినిధులు, అధికారులు తమ సమస్యలు పట్టించుకోవడం లేదంటున్నారు.
పెరగని జీతాలు
గ్రామాల్లో చెత్త సేకరణ, మురుగు కాల్వల శుభ్రత, పిచ్చి మొక్కల తొలగింపు, నీటి పైపుల లీకేజీలు, బ్లీచింగ్ పౌడర్ చల్లడం, వీధి దీపాలకు మరమ్మతు, దోమల నివారణకు ఫాగింగ్తో పాటు అన్ని పనులకు కార్మికులే ఆధారం. చాలా ఏళ్లుగా గ్రామ పంచాయతీల్లో పనులు చేస్తున్నా.. జీతాలు పెరగడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఆదాయం ఎక్కువగా ఉన్న జీపీల్లో కొంత వరకు జీతాలు అందిస్తున్నా చిన్న జీపీల్లో కార్మికులు జీవనం అస్తవ్యస్తం ఉంది. గతంలో పాలకవర్గం లేకపోవడం, నిర్వహణకు నిధులు లేకపోవడంతో పంచాయతీ కార్యదర్శులు అప్పులు చేసి నెట్టుకొచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులు రాకపోవడంతో తీవ్ర నిధుల కొరత ఏర్పడింది. కొన్ని గ్రామాల్లో ఇంటి పన్నుల వసూళ్లు, ఇతర ఆదాయ మార్గాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని కార్మికుల వేతనాలు, ఇతరాలకు వినియోగించారు. చెత్త సేకరణకు వినియోగించే ట్రాక్టర్లకు కొన్ని నెలలుగా పంచాయతీ కార్యదర్శులే సొంత డబ్బులతో డీజిల్ పోయించారు.
జిల్లాలో 2,500 మంది కార్మికులు
జిల్లాలో 461 పంచాయతీలు ఉండగా.. 2,500 మందికి పైగా కార్మికులు పారిశుద్ధ్య పనులు చేస్తున్నారు. ప్రతి కార్మికుడికి రూ.9,500ల వేతనంగా నిర్ణయించినా నిధుల కొరత కారణంగా అనేక పంచాయతీల్లో వేతనాలు చెల్లించకుండా పెండింగ్లో ఉంచారు.
ప్రధాన డిమాండ్లు
పంచాయతీ ఉద్యోగులకు, కార్మికులకు వేతనాలు క్రమంగా చెల్లించాలి.
2వ పీఆర్సీ పరిధిలోకి పంచాయతీ సిబ్బందిని తీసుకొచ్చి జీఓ నంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలి.
జీఓ నంబర్ 51ని సవరించి మల్టీపర్పస్ కార్మికుల విధానం రద్దు చేసి పాత కేటగిరీల ప్రకారం ఉద్యోగులుగా గుర్తించాలి.
కారోబార్లు, బిల్ కలెక్టర్లను సహాయ
కార్యదర్శులుగా నియమించాలి.
అర్హులైన ఉద్యోగులకు పదోన్నతులు
ఇవ్వాలి.
ఉద్యోగ భద్రత కల్పించి, రిటైర్మెంట్ బెనిఫిట్గా రూ.5లక్షల చొప్పున చెల్లించాలి.
ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకోవడానికి ఆర్థిక సాయంతో పాటు ప్లాట్లు ఇవ్వాలి.


