
ప్రజా పాలనలో ప్రజల ప్రభుత్వం
● ‘పనుల జాతర’ కోసం
రూ.20,200 కోట్లు మంజూరు
● మహిళలకు వడ్డీలేని రుణాలు
● అన్నిరంగాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
● రాష్ట్ర పంచాయతీరాజ్, శిశు సంక్షేమ,
గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క
అమ్రాబాద్/ వెల్దండ: ప్రజా పాలనలో ప్రజల ప్రభుత్వం పనిచేస్తుందని, ప్రజల దీవెనలతో అన్నివర్గాల ప్రజలు, అన్నిరంగాల అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్ , గ్రామీణాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఆదివారం అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి అమ్రాబాద్ మండలంలోని కల్ములోనిపల్లి, జంగంరెడ్డిపల్లి, మాధవానిపల్లి, మొల్కమామిడి, తుర్కపల్లి గ్రామాల్లో గ్రామ పంచాయతీ, అంగన్వాడీ కేంద్రాల నూతన భవనాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జంగంరెడ్డిపల్లిలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. పనుల జాతరలో భాగంగా మొత్తం 1,500 పనులకు గాను రూ.20,200 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఈ నిధులతో గ్రామ పంచాయతీ, అంగన్వాడీ భవనాలు తదితర అభివృద్ధి పనులు చేపట్టవచ్చన్నారు. ముఖ్యంగా మహిళా సంఘాల అభివృద్ధి కోసం ఇప్పటికే ప్రభుత్వం క్యాంటీన్లు, పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసి మహిళలు ఆర్థిక స్వావలంభన సాధించే దిశగా ప్రోత్సహిస్తుందని చెప్పారు. గత ప్రభుత్వం మహిళలకు పావలా వడ్డీ రుణాలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని, కానీ, తమ ప్రజల ప్రభుత్వం మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తుందని పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు రూ.17.81 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరిగిందన్నారు. గతంలో 60 ఏళ్లు దాటిన మహిళలను తొలగించారని, ఇప్పుడు వారిని కూడా చేర్చుకోవాలని తాము చెబుతున్నామన్నారు.
అందరి సహకారంతో అభివృద్ధి
ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలిచిన తాను అర్హులకు ప్రభుత్వ పథకాలు అందించడంతోపాటు ముఖ్యమంత్రి, మంత్రుల సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేస్తున్నానని ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. కృష్ణానదిపై బ్రిడ్జి, సాగునీరు, ఇతరత్రా అభివృద్ధి కోసం పాటుపడుతున్నానని వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దేవసహాయం, డీఆర్డీఓ ఓబులేష్, గ్రంథాలయ చైర్మన్ రాజేందర్, ఎంపీడీఓ లింగయ్య తదితరులు పాల్గొన్నారు. మంత్రి పర్యటన సందర్భంగా డీఎస్పీ పల్లె శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు.

ప్రజా పాలనలో ప్రజల ప్రభుత్వం