గిరిజన దర్బార్లో వినతులు ఇలా..
తొర్రూరు దుబ్బతండా గ్రామం నుంచి కారుణ్య నియామకం కింద తండ్రి పోస్టును ఇవ్వాలని కూతురు విన్నవించింది. ఏటూరునాగారం మండలం బూటారం గ్రామం నుంచి కుటుంబ సర్వేలో మైగ్రేట్ అని పడిందని దానిని తొలగించాలని కోరారు. వాజేడు మండలం కొంగాల గ్రామానికి చెందిన ఓ మహిళ ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలని పీఓ వేడుకుంది. ఖానాపురం మండలంలోని మంగళవారిపేటకు చెందిన ఓ వ్యక్తి 2008లో డీఎస్సీలో సెలక్ట్ అయ్యాయని దానికి సంబంధించిన రికార్డు ఇప్పించాలని అర్జీ అందజేశారు. గూడూరు మండలం మర్రిమిట్ట నుంచి గాంధీనగర్ కొత్తగూడలో స్వీపర్, అటెండర్, వాచ్ మెన్ పోస్టులు ఇప్పించాలని కోరారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ప్రతాప్, డీడీ జనార్దన్, డిప్యూటీ డీఎంహెచ్ఓ క్రాంతికుమార్, జీసీసీ డీఎం నాని పాల్గొన్నారు.
ములుగు రూరల్/ఏటూరునాగారం: జిల్లాలో ప్రజావాణి, గిరిజన దర్బార్లో వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బాధితులు 101 అర్జీలను ఉన్నతాధికారులకు సమర్పించారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో బాధితులు 82 అర్జీలను అందజేయగా అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) సంపత్రావు డీఆర్ఓ రవికుమార్, ట్రైనీ కలెక్టర్ కుషీల్, ఆర్డీఓ కృష్ణవేణితో కలిసి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. అదే విధంగా ఐటీడీఏలో నిర్వహించిన గిరిజన దర్బార్లో పీఓ లెనిన్ వత్సల్ టొప్పో 19 అర్జీలు రాగా వాటిని స్వీకరించారు. అధికారులు వాటిని త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు
భూ సమస్యలు
22
ఇతర శాఖలు
25
ఇందిరమ్మ ఇళ్లు
18
పింఛన్లు
17
మూడు నెలలుగా పింఛన్ రావడం లేదు
మూడు నెలల నుంచి పింఛన్ రావడం లేదు. వేలి ముద్రలు, ఐరిష్ రాకపోవడంతో పింఛన్ నిలిపి వేశారు. దీంతో పోషణ భారంగా మారింది. ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే పింఛన్ ఇప్పించాలి. –శాననేని స్వరూప, ఇంచర్ల
ఉపాధి కల్పించాలి..
కుటుంబ పెద్దను కోల్పోయి ఇద్దరు పిల్లలను పెంచడం భారంగా ఉంది. గత ఏడాది భర్త జ్వరంతో మృతి చెందాడు. వాజేడు ఐటీఐ కళాశాలలో స్వీపర్ పోస్టు ఇప్పించి ఉపాధి కల్పించాలి.
– హరిత, వాజేడు
●
ప్రజావాణిలో 82,
గిరిజన దర్బార్లో 19 అర్జీల రాక
స్వీకరించిన అదనపు కలెక్టర్ సంపత్రావు, పీఓ లెనిన్ వత్సల్ టొప్పో
పరిశీలించి పరిష్కరించాలని
అధికారులకు ఆదేశాలు


