ములుగు: అర్హులైన రైస్ మిల్లర్లందరికీ త్వరలో జరగనున్న రాష్ట్ర కమిటీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలని జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని అసోసియేషన్ కార్యాలయంలో ఆరు జిల్లాలకు చెందిన అసోసియేషన్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, సీనియర్ నాయకుల సమావేశంలో ప్రవీన్ మాట్లాడారు. 2013 నుంచి అసోసియేషన్ ఎన్నికలు జరగకపోవడంతో అప్పటి నుంచి ఒకే కార్యవర్గం అధికారంలో ఉందని తెలిపారు. గ్రామీణ స్థాయిలో ఉన్న మిల్లర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడంలో ఆ కమిటీ పూర్తిగా విఫలమైందన్నారు. మిల్లర్ల సంక్షేమానికి సదరు రాష్ట్ర అసోసియేషన్ కృషి చేయకపోవడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా రైస్ మిల్లర్లు అసోసియేషన్ నుంచి బయటకు వచ్చారని పేర్కొన్నారు. పాత బైలా ప్రకారంగా 25 వేల మెట్రిక్ టన్నుల సీఎంఆర్కు ఒక ఓటు చొప్పున నిర్ణయించారని తెలిపారు. ఇది రైస్ మిల్లర్ల సంక్షేమానికి పూర్తి విరుద్ధమని వెల్లడించారు. మిల్లు నడుపుతున్న ప్రతీ యజమానికి ఓటుహక్కు కల్పించాలని కోరారు. దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైస్ మిల్లర్లను సమీకరించి ఎన్నికల కమిటీపై ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు. ఉద్యమ కార్చాచరణ సిద్ధమైందని, రైస్ మిల్లర్లందరూ సంఘటితం కావాలని కోరారు. ఈ సమావేశంలో ఆల్ ఇండియా రైస్ మిల్లర్స్ ఫెడరేషన్ ఉపాధ్యక్షులు సంపత్ కుమార్, మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంజయ్య, వరంగల్ జిల్లా అధ్యక్షుడు రవీందర్, జనగామ జిల్లా అధ్యక్షుడు ముత్తయ్య, భూపాలపల్లి జిల్లా గౌరవాధ్యక్షుడు రవి, మహబూబాబాద్ జిల్లా కోశాధికారి సతీశ్ పాల్గొన్నారు.
రైస్ మిల్లర్స్ అసోసియేషన్
అధ్యక్షుడు ప్రవీణ్


