ములుగురూరల్: ములుగు మున్సిపాలిటీ పరిధిలోని మంత్రి సీతక్క నాటించిన మొక్కలకే రక్షణ లేకుండా పోయిందని 9వ వార్డు కౌన్సిలర్ గండ్రకోట వాణికుమార్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆమె ఆదివారం విలేకర్లతో మాట్లాడారు. ఇటీవల కాలంలో మంత్రి సీతక్క, కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావులు 14, 15, 9 వార్డుల్లో రూ.50వేలు ఖర్చు పెట్టి మెయిన్ రోడ్డుకు డివైడర్లకు ఇరుపక్కల మొక్కలు నాటించారని తెలిపారు. నాటిన మొక్కలను మున్సిపాలిటీ అధికారులు గాలికి వదిలేశారని వెల్లడించారు. అధికారుల నిర్లక్ష్యంతో ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని వివరించారు. నాటిన మొక్కల చుట్టూ కనీసం ఫెన్సింగ్ ఏర్పాటు చేయకపోవడంతో మొక్కలను పశువులు మేస్తున్నాయని తెలిపారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి మిగిలిన మొక్కలను రక్షించేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.


