గోవిందరావుపేట: పేదలకు ప్రభుత్వం పంపిణీ చేయాల్సిన 298.40 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా ఛత్తీస్గఢ్కు తరలిస్తున్న లారీని అధికారులు పట్టుకున్నారు. డిప్యూటీ తహసీల్దార్(సివిల్ సప్లయీస్) విజయ్ కుమార్, పస్రా ఎస్హెచ్ఓ తాజొద్దీన్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన సంయుక్త దాడుల్లో ఈ భారీ అక్రమ రవాణా వెలుగులోకి వచ్చింది. పక్కా సమాచారంతో నిఘా ఏర్పాటు చేసిన అధికారులు ఓ లారీని తనిఖీ చేయగా అందులో 298.40 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. అనంతరం వాటిని సీజ్ చేసి మండలంలోని లక్ష్మీగణపతి రైస్ మిల్లులో భద్రపరిచారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి రవాణాకు పాల్పడిన వారిపై విచారణ చేపట్టినట్లు తెలిపారు. ఈ బియ్యం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి నుంచి బయలుదేరి, లింగాల–పస్రా మార్గం మీదుగా ఛత్తీస్గఢ్కు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై తాజొద్దీన్ మాట్లాడుతూ పేదలకు అందాల్సిన పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలించే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.


