● వీసీలో రాష్ట్ర ప్రభుత్వ
ప్రధాన కార్యదర్శి
సంజయ్ జాజు
ములుగు: ఎల్నినో ప్రభావంతో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో, ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ములుగు కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్ సంపత్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ జిల్లా ఇన్చార్జ్ మంత్రుల ఆధ్వర్యంలో 19న జిల్లా స్థాయిలో ఎల్నినో ప్రత్యామ్నాయ ప్రణాళిక సమీక్షాసమావేశం నిర్వహించనున్న సందర్భంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో వ్యవసాయం, తాగునీరు, విద్యుత్ రంగాలపై పడే ప్రభావాన్ని తగ్గించడానికి క్షేత్రస్థాయిలో పకడ్బందీ చర్యలు చేపట్టాలని సూచించారు. వాతావరణ శాఖ సూచన మేరకు కాలానుగుణ అంచనాలు, వర్షపాత అవుట్లుక్ ఆధారంగా జిల్లా ప్రణాళికా అధికారి ఆధ్వర్యంలో రైతులకు, ప్రజలకు ఎప్పటికప్పుడు ముందస్తు సమాచారాన్ని చేరవేయాలన్నారు. ఈ వీసీలో డీఎంహెచ్ఓ గోపాల్ రావు, డీపీఓ వెంకయ్య, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


