కాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్గా డాక్టర్ కాటం రాంకుమార్రెడ్డిని నియమిస్తూ శుక్రవారం కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఉత్తర్వులు జారీ చేశారు. ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెంటెండ్గా డాక్టర్ హరీశ్చంద్రారెడ్డి హైదరాబాద్కు బదిలీ అయిన తర్వాత కొత్త సూపరింటెండెంట్ కోసం అందరూ ఎదురుచూశారు. పలువురు సీనియర్ వైద్యుల పేర్లు కూడా పరిగణనలోకి వచ్చాయి. డీఎంఈ నుంచి ఆదేశాలు రాకపోవడంతో ఎవరు సూపరింటెండెంట్గా వస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. దాదాపు 45 రోజుల నుంచి ఆస్పత్రిలో నెలకొన్న ఆర్థికపరమైన పలు సమస్యలు, బిల్లుల చెల్లింపులు, ఇతర వైద్యసేవల విషయంలో ఏర్పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కలెక్టర్ సత్యశారద ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్పర్సన్గా నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ఆస్పత్రిలో ఎలాంటి ఆర్థిక సమస్యలు రాకుండా, పరిపాలనా పరంగా నిబంధనల మేరకు నిర్ణయం తీసుకునే విధంగా డాక్టర్ రాంకుమార్రెడ్డి సూపరింటెండెంట్గా (ఎఫ్ఏసీ) అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే, సూపరింటెండెంట్ ర్యాటిఫికేషన్ కోసం డీఎంఈకి సమాచారం పంపినట్లు తెలుస్తోంది. ఏదేమైనా డీఎంఈ నుంచి కూడా ఉత్తర్వులు రావాల్సి ఉంది. కాగా, సూపరింటెండెంట్గా డాక్టర్ రాంకుమార్రెడ్డి ఽశనివారం చాంబర్లో బాధ్యతలు స్వీకరించనున్నారు.
మెడికల్ రికార్డు ఆఫీసర్గా రవీందర్
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి మెడికల్ రికార్డు ఆఫీసర్ (ఎంఆర్ఓ)గా వంగ రవీందర్ను నియమించారు. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ నుంచి శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. గత సంవత్సరం జూన్ 30 వరకు మెడికల్ రికార్డు ఆఫీసర్గా పనిచేసిన రామకృష్ణ ఉద్యోగ విరమణ చేశారు. దీంతో ఇదేస్థానంలో రవీందర్ ఇన్చార్జ్గా వ్యహరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన మెడికల్ రికార్డు టెక్నీషియన్ నుంచి పదోన్నతి పొంది పూర్తిస్థాయి మెడికల్ రికార్డు ఆఫీసర్గా రానున్నారు. కాగా, శనివారం ఆయన ఎంఆర్డీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నారు.
కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఉత్తర్వులు జారీ


