ములుగు: ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు వ్యవసాయం, ఉద్యానశాఖల అధికారులు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ సీహెచ్.మహేందర్జీ పిలుపునిచ్చారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో నీటి పారుదల, వ్యవసాయ, ఉద్యాన, భూగర్భ జల వనరుల శాఖల అధికారులతో బుధవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఎల్నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల గురించి రైతులకు వ్యవసాయ విస్తరణ అధికారులు వివరించి చెప్పాలన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో సాగు చేసిన పంటల వివరాల నివేదికను తయారు చేసుకోవాలన్నారు. జిల్లాలో ఉన్న సాగునీటి వనరుల ద్వారా గతేడాది ఎన్ని ఎకరాల్లో వరి సాగు చేశారు.. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పంట పొలాలకు సాగునీరు అందుతుందా.. లేదా అని అంచనా వేసుకొని రైతులకు తెలపాలని సూచించారు. ఇప్పటికే భూగర్భ జల వనరుల శాఖ ఇచ్చిన నివేదికలు ఆశించిన స్థాయిలో లేవని, పంటల మార్పిడి ఆవశ్యకత ఉందని వివరించాలన్నారు. ఆయిల్పామ్ కేవలం ఉద్యానశాఖకు సంబంధించినదేనని ఏఈవోలు నిర్లక్ష్యం చేయకుండా ఉద్యానశాఖ అధికారులతో సమన్వయం చేసుకుని ఆయిల్పామ్ సాగు లక్ష్యాన్ని చేరుకోవాలని స్పష్టం చేశారు. ఇక నుంచి ప్రతీవారం అధికారుల డ్యూటీ చార్ట్ నివేదికను తనకు పంపించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంపత్రావు, విద్యుత్ శాఖ ఎస్ఈ భిక్షపతి, డీఏఓ సురేశ్ కుమార్ పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ మహేందర్జీ


