ములుగు /ములుగు రూరల్: బోధనలో సాంకేతిక అంశాలతో విద్యార్థులకు ఆసక్తిని రేకెత్తించేలా, ఆహ్లాదకరంగా తరగతి గది వాతావరణం పెంపొందించే విధంగా ఎటువంటి చర్యలు చేపట్టాలనే అంశంపై నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని డీఈఓ సిద్ధార్థరెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో భౌతిక రసాయన శాస్త్రం ఉపాధ్యాయులకు, జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయులకు, బండారుపల్లి మోడల్ స్కూల్లో ఇంగ్లిష్ సబ్జెక్టు టీచర్లకు మూడు రోజుల పాటు నిర్వహించనున్న శిక్షణ కార్యక్రమాన్ని డీఈఓ సోమవారం ప్రారంభించి మాట్లాడారు. శిక్షణ కేంద్రం వద్ద సమయపాలన పాటిస్తూ సకాలంలో హాజరై తరగతులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ట్రైనింగ్లో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో విద్యార్థులకు చేరవేసేలా కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా శిక్షణకు సంబంధించిన పోస్టర్లను డీఈఓ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ కోర్స్ కోఆర్డినేటర్ శ్యామ్సుందర్ రెడ్డి, సమగ్ర శిక్ష కోఆర్డినేటర్లు సైకం శ్రీనివాస్ రెడ్డి, గుల్లపెల్లి సాంబయ్య, సంబంధిత సెంటర్ ఇన్చార్జ్లు కన్నం వినోద్ కుమార్, గందె రమేశ్, సింగారపు దేవకి పాల్గొన్నారు.
విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థరెడ్డి అన్నారు. ఈ మేరకు సోమవారం బండారుపల్లి పీఎం శ్రీ మోడల్ పాఠశాల విద్యార్థి బాచి రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో కాంస్య పతకం సాధించడంతో బాచిని అభినందించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రంగాలలో ముందుండాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ దేవకి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థరెడ్డి


