భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లో సోమవారం సోలార్ టెక్నీషియన్ శిక్షణ కార్యక్రమాన్ని ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో పునరుత్పాదక ఇంధన రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో సోలార్ ఎనర్జీ రంగంలో నైపుణ్యం కలిగిన టెక్నీషియన్లకు విస్తృత ఉపాధి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. శిక్షణ పొందుతున్న యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. సోలార్ ప్యానెళ్ల అమరిక, నిర్వహణ, లోపాల గుర్తింపు, మరమ్మతులు, ఇన్వర్టర్ వ్యవస్థలు, విద్యుత్ భద్రతా ప్రమాణాలు తదితర అంశాలపై శిక్షణ అందించనున్నట్లు చెప్పారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో యువతను తీర్చిదిద్ది ఉపాధి అవకాశాలను విస్తరించడమే సింగరేణి లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఓటు జీఎం కృష్ణప్రసాద్, వీటీసీ మేనేజర్ నజీర్ తదితరులు పాల్గొన్నారు.


