వాజేడు: ప్రకృతి అందాలను ఆస్వాధించేందుకు పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులు విహార యాత్రలను చేస్తున్నారు. కాని అదే విహార యాత్ర కొందరి కుటుంబాల్లో విషాధాన్ని నింపుతుంది. పర్యాటకుల సందడితో ప్రతీనిత్యం కళకళలాడుతున్న బొగత జలపాతం తప్ప మండల పరిధిలోని మిగతా జలపాతాల సందర్శనను అధికారులు నిషేధించారు. కొన్ని జలపాతాలు పూర్తిగా రిజర్వ్ ఫారెస్టులో ఉండటంతో భద్రత కూడా కష్టంగా ఉంటుంది. దీంతో విహారయాత్ర కాస్త విషాద యాత్రగా మారుతుంది. పోలీసులు, అటవీ శాఖాధికారులు ఎన్నో ఆంక్షలను పెట్టి కట్టుదిట్టమైన రక్షణ చర్యలను ఏర్పాటు చేసినప్పటికీ పర్యాటకుల అత్యుత్సాహం ప్రాణాలను బలిగొంటుంది. ఇప్పటి వరకు బొగత జలపాతంలో పడి సుమారుగా 24 మంది, దూసపాటి లొద్దిలో 9 మంది, మాసన్ లొద్దిలో ఒకరు మృతువాత పడ్డారు. బొగత జలపాతం వద్ద ప్రతీ ఏడాది వర్షాకాలంలో పర్యాటకులతో సందడిగా ఉంటుంది. గోదావరిపై బ్రిడ్జిని నిర్మించడంతో నాలుగేళ్లుగా పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో బొగత అందాలను వీక్షించడానికి తరలివస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే యువత సరదా కోసం చేసే పనులతో ప్రాణాల మీదకు వస్తుంది.
సెల్ఫీలతో విషాదం
పర్యాటక ప్రాంతాల్లో సరదాగా గడిపేందుకు వస్తున్న పర్యాటకులు ప్రకృతి అందాలను వీక్షిస్తే పర్వాలేదు. కాని కొందరు పర్యాటకులు ఫొటోలు తీసుకోవడంతో పాటు నీటిలో దిగి సెల్ఫీల కోసం సందడి చేస్తున్నారు. ఆ సమయంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృత్యువాత పడుతున్నారు. దీంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంటుంది. ప్రకృతి అందాలను వీక్షిస్తూ సేద తీరి క్షేమంగా ఇంటికి చేరే వరకు తల్లిదండ్రులు కంటి మీద కునుకు లేకుండా ఉంటారనే విషయం పర్యాటక ప్రాంతాలకు వచ్చిన వారు గుర్తుంచుకుంటే ప్రాణనష్టం సంభవించదు. కొందరు రీల్స్ కోసం చేసే ప్రయత్నాలు వికటించి ప్రాణాలు పోతుండటంతో సదరు కుటుంబాల్లో విషాదఛాయలు నింపుతున్నాయి.
నిషేధించిన జలపాతాలివే..
వాజేడులోని కర్రె గుట్టల వెంట పలు జలపాతాలు ఉన్నాయి. మాసన్ లొద్ది, దూసపాటి లొద్ది, గుండం, భామన సిరి మరో రెండు మూడు జలపాతాలు ఉన్నాయి. ఇవి అన్ని రిజర్వ్ ఫారెస్టులో ఉండటంతో జిల్లా, మండల స్థాయి అధికారులు వాటిని చూడడం నిషేధించారు. అక్కడికి పర్యాటకులు వెళ్ల కుండా ఫ్లెక్సీలను కట్టి కొన్ని చోట్ల సిబ్బందిని కాపలా పెట్టారు. మరి కొన్ని చోట్ల కాపలా ఉండటం లేదు. దీంతో కొందరు పర్యాటకులు గూగుల్ మ్యాప్ ఆధారంగా దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న జలపాతాలకు దొంగదారిలో వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చు కుంటున్నారు.
విషాదంగా మారుతున్న విహారం
జలపాతాల్లో ఇప్పటికి 44 మంది మృతి


