ములుగు: పేద ప్రజల అభ్యున్నతికి దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అందించిన సేవలు మరువలేనివని కాంగ్రెస్ నాయకులు కొనియాడారు. ఈ మేరకు వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని బుధవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ముసినపల్లి కుమార్గౌడ్ ఆధ్వర్యంలో నాయకులు వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్ హాజరై మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదల గుండెల్లో వైఎస్సార్ చిరస్థాయిగా నిలిచిపోయారని తెలిపారు. నాడు వైఎస్సార్ అమలు చేసిన పథకాలు కొన్ని ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కిసాన్సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్, డీసీసీ ఉపాధ్యక్షుడు పల్లె జయపాల్రెడ్డి, నాయకులు వంగ రవియాదవ్, చింతనిప్పుల భిక్షపతి, మట్టెవాడ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.


