ములుగు: జిల్లాలో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ 95.62 శాతం పూర్తయింది. జిల్లాలో మొత్తం 2,36,970 మంది ఓటర్లకు గాను ఇప్పటివరకు 2,26,585 మందికి ఎన్యుమరేషన్ ఫారాలను బీఎల్ఓలు పంపిణీ చేయడంలో 95.62 శాతం పురోగతి సాధించారు. ఇంకా 10,385 మంది ఓటర్లకు ఫారాలులు అందించాల్సి ఉంది. 2,36,970 మందికి 1,96,663 మందికి మ్యాపింగ్ పూర్తి కాగా, ఇంకా 40,307 మంది మ్యాపింగ్ చే యాల్సి ఉంది. మ్యాపింగ్ పనులు కొంతమేర ముందుకు సాగుతున్నప్పటికీ, పూర్తి స్థాయిలో లక్ష్యాన్ని చేరుకోలేదు. ఓటర్లు నింపిన ఫారాలను బీఎల్ఓలు సేకరిస్తూ డిజిటలైజేషన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 1,803 మందికి డిజిటలైజేషన్ పూర్తి చేశారు. సాంకేతిక కారణాలతో డిజిటలైజేషన్ ప్రక్రియ నెమ్మదిగా కొనసాగుతోందని సమాచారం.
వివరాలు నమోదులో జాప్యం
ఓటు మ్యాపింగ్ ప్రకారం బీఎల్ఓలు ఓటర్లకు ఫారాలు అందిస్తున్నారు. ఓటర్లకు ఇచ్చిన ఫారాల్లో 2002 నాటికి ఓటు హక్కు ఉన్నవారు ఒకవైపు, 2002 తర్వాత ఓటు హక్కు పొందిన వారు మరో వైపు వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఓటర్లకు బీఎల్ఓలు రెండేసి ఫారాలు అందిస్తున్నారు. వివరాలు నమోదు చేశాక బీఎల్ఓలు ఒక ఫారం తీసుకుంటే మరో ఫారం ఓటరు వద్దనే ఉంటుంది. కాని దరఖాస్తులు నింపడంలో ఓటర్లు అయోమయానికి గురై వివరాలు నమోదు చేయకపోవడంతో జాప్యం జరుగుతుంది. ఓటరు పూర్తి వివరాలు నమోదు చేసిన తర్వాతనే ఫారాలు తీసుకొని బీఎల్ఓలు యాప్లో ఓటరుగా నమోదు చేస్తారు. ఓటర్లు ఇచ్చిన వివరాలతో జూలై 31న ముసాయిదా ఓటరు జాబితా ప్రకటిస్తారు. జాబితాపై అభ్యంతరాలుంటే ఆగస్టు 31 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. సెప్టెంబర్ 29 వరకు పరీశీలన పూర్తి చేసి అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా ప్రకటిస్తారు.
ఫారం నింపడంలో ఇబ్బందులు
బీఎల్ఓలు ఇచ్చిన ఎన్యుమరేషన్ ఫారాలు నింపడంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న ఓటర్లు ఫారంలోని వివరాలు అర్థం చేసుకోవడం, అవసరమైన సమాచారాన్ని సరిగా నమోదు చేయడంలో ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది వృద్ధులు, నిరక్షరాస్యులు అయితే పూర్తిగా ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకుని అధికారులు గ్రామాల వారీగా ప్రత్యేక సహాయక కేంద్రాలు ఏర్పాటు చేయాలని, సిబ్బంది ఫారం నింపడంలో డోర్ టు డోర్ సహాయం అందిస్తే తప్ప డిజిటలైజేషన్ ప్రక్రియ సకాలంలో పూర్తయ్యే అవకాశాలు లేవు. ఓటర్లకు ఫారం నింపడంలో సరైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, ఫారంల నింపడంపై స్పష్టత కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.
జిల్లాలో తుదిదశకు చేరిన
ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ
2,36,970 మంది ఓటర్లకు 2,26,585 మందికి పంపిణీ
1,96,663 మందికి మ్యాపింగ్ పూర్తి
ప్రారంభమైన డిజిటలైజేషన్ ప్రక్రియ
దరఖాస్తు నింపడంలో ఇబ్బందులు పడుతున్న ఓటర్లు
మండలం మొత్తం పంపిణీ
ఓటర్లు చేసినవి
ములుగు 52,738 48,939
వెంకటాపురం(ఎం) 33,032 32,900
గోవిందరావుపేట 25,541 23,984
తాడ్వాయి 18,217 17,967
ఏటూరునాగారం 24,784 23,430
కన్నాయిగూడెం 10,090 9,663
మంగపేట 39,524 38,625
కొత్తగూడ 23,843 22,150
గంగారం 9,201 8,927
నిర్ణీత గడువులోగా పూర్తి
జిల్లాలో చేపడుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నాం. నిర్దేశించిన సమయంలోగా ప్రతీ దశను పూర్తి చేస్తాం. జిల్లాలో ఇప్పటివరకు 96 శాతం గణన ఫారాల పంపిణీ పూర్తయింది. అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా ప్రకటిస్తాం. ప్రజలు, రాజకీయ పార్టీలు, ఎన్నికల సిబ్బంది సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.
– భోర్ఖడే హేమంత్ సహదేవరావు, కలెక్టర్


