జిల్లాలోని జాబ్కార్డులు, కూలీల వివరాలు
అమలుకు సర్వం సిద్ధం
అమల్లోకి వీబీజీ రామ్జీ పథకం
ములుగు: నిరుపేదలకు పనులు కల్పించడమే లక్ష్యంగా గత యూపీఏ ప్రభుత్వం రూపకల్పన చేసిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) జూలై 1 నుంచి కొత్తగా రూపుదిద్దుకుంటుంది. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్ అండ్ అజివిక మిషన్ గ్రామీణ్ (వీబీజీ రామ్జీ) పథకం పేరుతో అమలు చేయబోతుంది. ఈ మేరకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ కొత్త నిబంధనలకు అనుగుణంగా గ్రామీణ ఉపాధి హమీ పథకాన్ని అమలు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది.
జిల్లాలోని 10 మండలాల పరిధిలో 2026–27 సంవత్సరానికి గాను వివిధ రకాల మెటీరియల్ కంపోనెంట్ పనులు 2,847 చేపట్టగా పురోగతిలో ఉన్నాయి. ప్రతీ గ్రామంలో గ్రామైఖ్య సంఘాల భవన నిర్మాణాలు ఆలస్యంగా ప్రారంభించడంతో పాటు మెటీరియల్ కంపోనెంట్ నిధులు సకాలంలో విడుదల కాకపోవడంతో పనులు మందకొడిగా సాగుతున్నాయి. ఈ నిధుల ద్వారా గ్రామాల్లో సీసీ రోడ్లు, మురుగు కాల్వలు, గ్రామైఖ్య సంఘం, పంచాయతీ భవనాలు, అంగన్వాడీ కేంద్రాల భవనాలు వంటి పనులు చేపట్టారు. ఇప్పటి వరకు 70 శాతం మేర పనులు పూర్తయినట్లు సమాచారం. పాత 100 రోజుల పనికి సంబంధించిన వేతనాలు జూన్ 9వ తేదీ వరకు చెల్లించారు.
నూతన చట్టం ప్రకారం పనిదినాలను 100 రోజులు నుంచి 125 రోజులకు పెంచారు. గతంలో కేంద్ర ప్రభుత్వమే ఉపాధి పనులకు 100 శాతం నిధులు కేటాయించేది. కొత్త పథకంలో కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులను భరించాల్సి ఉంటుంది. గతంలో 263 రకాల పనులకు మాత్రమే అనుమతి ఉండగా నూతన పథకంలో 318కి పెంచారు. గతంలో నీటిపారుదలశాఖ ఆధీనంలో ఉండే చెరువుల పూడికతీత పనులను ఉపాధిహామీ కింద చేసేవారు. ఇకపై ఆ నిర్వహణ ఖర్చులను నీటిపారుదల శాఖనే భరించాల్సి ఉంటుంది.
జిల్లాలో మొత్తం జాబ్కార్డులు 83,011
ఆక్టివ్ జాబ్ కార్డులు 81,915
కూలీలు 1.69లక్షలు
2026–27 పని దినాల లక్ష్యం 10.96 లక్షలు
కల్పించిన పని దినాలు 9.76 లక్షలు
ఉపాధిహామీ పథకంలో కొత్త నిబంధనల అమలుకు సర్వం సిద్ధం చేస్తున్నాం. జూలై 1 నుంచి వీబీజీ రామ్జీ పథకం అమలుకు ప్రభుత్వం నిర్ణయించింది. పథకం అమలుకు ఉన్నతాధికారులు తగిన సూచనలు చేశారు. పకడ్బందీగా అమలు చేసేలా అన్ని చర్యలు తీసుకుంటున్నాం.
– వెంకటనారాయణ, ఏపీడీ ములుగు
ఇకపై 125 పనిదినాలు
కొత్త నిబంధనల అమలుకు
గ్రామీణాభివృద్ధి శాఖ ఏర్పాట్లు


