
రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
ఏటూరునాగారం: అకాల వర్షంతో మిర్చి, వరితో పాటు తదితర పంటలు దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహరావు అన్నారు. మండల కేంద్రంలోని పలు ప్రాంతాల్లో దెబ్బతిన్న పంటలను ఆయన నాయకులతో కలిసి సోమవారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు, ఈదురు గాలులకు సుమారు వెయ్యి ఎకరాల మేర పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. గాలివాన బీభత్సానికి కల్లాల్లో మిర్చి తడవడంతో పాటు వరిధాన్యం మొత్తం రాలిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎండి.ఖాజాపాషా, తుమ్మ మల్లారెడ్డి, పోరిక గోవిందనాయక్, తాడూరి రఘు, తక్కెళ్లపల్లి మోహన్, గోవిందరావుపేట మాజీ జెడ్పీటీసీ తుమ్మల హరిబాబు, కుమ్మరి చంద్రబాబు, జాడి భోజారావు తదితరులు పాల్గొన్నారు.
సీసీ రోడ్డు పనుల పరిశీలన
దెబ్బతిన్న పంటల పరిశీలన అనంతరం లక్ష్మీనర్సింహరావు మండల కేంద్రంలోని డిగ్రీ కళాశాల నుంచి ఆస్పత్రి వరకు రూ.1కోటితో నిర్మించిన సీసీ రోడ్డు పనులను ఆయన పరిశీలించారు. సీసీ రోడ్డు సైడ్ బర్మ్స్ పనులు నిబంధనల ప్రకారం చేపట్టలేదన్నారు. సదరు కాంట్రాక్టర్ పక్కనే ఉన్న చెరువు మట్టితో పాటు డిగ్రీ కళాశాల గోడ పక్కన ఉన్న మట్టిని తోడి వేస్తున్నాడని, దీంతో కళాశాల గోడ కూలే ప్రమాదం ఉందని తెలిపారు. చెరువు మట్టి తీయడం నిబంధనలకు వ్యతిరేకమని సంబంధిత శాఖ ఈఈ అజయ్తో మాట్లాడారు. పనుల్లో నాణ్యత లేకుంటే బిల్లు మంజూరు చేయరాదని తెలిపారు. సదరు కాంట్రాక్టర్ మంత్రి సీతక్క అనుచరుడు కావడంతో అధికారుల అండదండలతో ఇష్టానుసారంగా పనులు చేస్తున్నాడని తెలిపారు.
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనర్సింహరావు