'వేట్టయాన్‌' భారీ ఆఫర్‌.. టికెట్ల రేట్లు తగ్గింపు | Vettaiyan Movie Ticket Rates Reduced | Sakshi
Sakshi News home page

'వేట్టయాన్‌' భారీ ఆఫర్‌.. టికెట్ల రేట్లు తగ్గింపు

Oct 17 2024 7:49 AM | Updated on Oct 17 2024 8:59 AM

Vettaiyan Movie Ticket Rates Reduced

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన ‘వేట్టయాన్‌’ బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్లతో సత్తా చాటుతుంది. ఇప్పటి వరకు సుమారు రూ. 300 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ రాబట్టింది. దసరా సెలవులు ఈ చిత్రానికి బాగా కలిసొచ్చాయని చెప్పవచ్చు. అక్టోబర్‌ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రాన్ని TJ జ్ఞానవేల్ తెరకెక్కించారు. లైకా ప్రొడక్షన్స్‌ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఈ సినిమాలో మంజు వారియర్‌, ఫహద్‌ ఫాజిల్‌, రానా దగ్గుబాటి, కిశోర్‌, అభిరామి, రితికా సింగ్‌, దుషారా విజయ్‌, రోహిణి ముఖ్యపాత్రల్లో కనిపించారు. అనిరుధ్‌ రవిచందర్‌  సంగీతం అందించారు.

దసరా సెలవులు ముగియడంతో వేట్టయాన్‌ సినిమా టికెట్ల రేట్లు తగ్గించారు. ఈమేరకు అధికారికంగా తెలిపారు. ఈ రేట్లు అక్టోబర్ 18 నుంచి అందుబాటులోకి రానున్నాయి. దీంతో వేట్టయాన్‌కు మళ్లీ కలెక్షన్స్‌ పెరిగే ఛాన్స్‌ ఉంది. మల్టీ ప్లెక్స్‌లలో రూ. 200, సిటీ సింగిల్ స్క్రీన్‌లలో రూ. 150, డిస్ట్రిక్ట్ సింగిల్ థియేటర్లలో రూ. 110గా టికెట్ రేట్లు ఉండనున్నాయి. అయితే, ఈ ఆఫర్‌ తెలంగాణలో మాత్రమే ఉండనుంది. ఏసియన్ ఎంటర్‌టైన్‌మెంట్‌, దిల్ రాజు 
సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేశారు. సీడెడ్ ఏరియాలో మాత్రం శ్రీ లక్ష్మీ మూవీస్ రిలీజ్ చేశారు.

కథేంటంటే.. 
ఎస్పీ అదియన్‌ (రజనీకాంత్‌) ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌. తప్పు చేసిన వాళ్లకు వెంటనే శిక్ష పడాలని భావిస్తాడు. అతనికి ఓ దొంగ ఫ్యాట్రిక్‌ (ఫహద్‌ ఫాజిల్‌) సహాయం చేస్తుంటాడు. ఓ సారి స్కూల్‌ టీచర్‌ శరణ్య(దుషారా విజయన్‌)ఇచ్చిన ఫిర్యాదుతో గంజాయి మాఫియా లీడర్‌ని అదియన్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు శరణ్య హత్యకు గురవుతుంది. ఓ వ్యక్తి స్కూల్‌లోనే ఆమెను హత్యాచారం చేసి దారుణంగా చంపేస్తాడు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్‌ ఎస్సీ హరీశ్‌ కుమార్‌(కిశోర్‌)కి అప్పగిస్తారు.

ఈ కేసులో బస్తీకి చెందిన యువకుడు గుణను అరెస్ట్‌ చేయగా.. తప్పించుకొని పారిపోతాడు. దీంతో ఉపాధ్యాయ సంఘాలతో సామాన్య ప్రజల నుంచి కూడా తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. దీంతో డీజీడీ శ్రీనివాస్‌(రావు రమేశ్‌) ఈ కేసును ఎస్పీ అదియన్‌కి అప్పగిస్తాడు. ఆయన 48 గంటల్లోనే గుణను పట్టుకొని ఎన్‌కౌంటర్‌ చేస్తాడు. ఇది బూటకపు ఎన్‌కౌంటర్‌ అంటూ మానవ హక్కుల సంఘం కోర్టు మెట్లు ఎక్కగా.. సీనియర్‌ న్యాయమూర్తి సత్యదేవ్‌(అమితాబ్‌ బచ్చన్‌) నేతృత్వంలో విచారణ కమిటీ వేస్తారు. సత్యమూర్తి విచారణలో గుణ ఈ హత్య చేయలేదని తెలుస్తుంది. మరి శరణ్యను హత్య చేసిందెవరు? ఎందుకు చేశారు? హంతకుడిని ఎస్పీ అదియన్‌ ఎలా కనిపెట్టాడు?  ఈ కథలో రానా దగ్గుబాటి పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే

Advertisement
 
Advertisement
Advertisement