ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూనే..నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాడు కిరణ్ అబ్బవరం. కొత్త వాళ్లను ఎంకరేజ్ చేయడమే లక్ష్యంగా తన సొంత నిర్మాణ సంస్థ కేఏ ప్రొడక్షన్స్ పై ‘తిమ్మరాజుపల్లి టీవీ’ అనే సినిమాను నిర్మించాడు.ఈ చిత్రంతో సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్స్, వి.మునిరాజు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘తిమ్మరాజుపల్లి టీవీ’పై హైప్ క్రియేట్ అయింది. మంచి అంచనాలతో నేడు(ఏప్రిల్ 17) రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది? రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
ఈ సినిమా కథ 1996 నేపథ్యంలో సాగుతుంది. కుప్పం దగ్గర్లోని తిమ్మరాజుపల్లి గ్రామానికి చెందిన సతీష్(సాయి తేజ్).. అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి ప్రతి శివరాత్రికి టీవీ, వీసీఆర్ని రెంట్కి తీసుకొచ్చి సినిమాలు వేస్తుంటాడు. ఆ ఊరికి తొలిసారి టీవీ కొని తీసుకొస్తాడు రాజప్ప(పదీప్ కొట్టె). రాజప్ప చెల్లెలు శారద(వేద జలంధర్)కు సతీష్ అంటే చాలా ఇష్టం. ఇద్దరు ప్రేమలో ఉంటారు. అది రాజప్పకు నచ్చదు. ఓ రోజు టీవీ చూసేందుకు ఇంటికి వచ్చిన సతీష్తో రాజప్ప తండ్రి గొడవకు దిగుతాడు. అదికాస్త పెద్దదై.. రాజప్ప, సతీష్ తీవ్రంగా కొట్టుకుంటారు. ఆ మరుసటి రోజే.. రాజప్ప ఇంట్లో ఉన్న టీవీని ఎవరో ఎత్తుకెళ్లిపోతారు.
సతీషే ఆ టీవీని దొంగతనం చేశాడంటూ రాజప్ప పంచాయితీ పెడతాడు. ఊరంతా సతీష్ని దొంగ అంటుంది. రెండు వారల్లో టీవీ దొంగతనం చేసినవాళ్లను కనిపెట్టి, పంచాయితీ ముందు నిలపెడతానని సతీష్ సవాల్ చేస్తాడు. అసలు ఆ టీవీని దొంగతనం చేసిందెవరు? ఎందుకు చేశారు? తనపై పడ్డ నిందను పోగొట్టుకునేందుకు సతీష్ ఏం చేశాడు? సతీష్-శారదల ప్రేమ ఏమైంది? సిద్దు(లతీష్ కీలపట్టు) వల్ల సతీష్కి ఎదురైన సమస్యలు ఏంటి? టీవీ వల్ల వచ్చిన ఇబ్బందులు ఏంటి? చివరకు సతీష్ -శారదలు ఒకటయ్యారా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
90లలో టీవీ అనేది ఒక ఎమోషన్. గ్రామాలల్లో ఒకరిద్దిరి ఇంట్లోనే టీవీలు ఉండేవి. సినిమాలు, సీరియళ్లు చూసేందుకు ఊరంతా వారింటి ముందు క్యూకట్టేది. వాళ్లు చీదరించుకున్నా..తిట్టినా పట్టించుకోకుండా టీవీ చూస్తూ ఉండిపోయేవాళ్లు. ఇప్పటితరానికి ఇవేవి తెలియదు కానీ.. 80-90 తరానికి చెందినవాళ్లకు మాత్రం టీవీతో ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి. ఆ జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేసిన సినిమా ‘తిమ్మరాజుపల్లి టీవీ’. దర్శకుడు వి. మునిరాజు ఎంచుకున్న పాయింట్ చిన్నదే అయినా దాని చుట్టు అల్లుకున్న సన్నివేశాలు బాగున్నాయి. ఒక చిన్న లైన్ని తీసుకొని.. దానికి పల్లెటూరి అనుబంధాలను, చక్కని ప్రేమ కథను జత చేసి.. ఫుల్ ఎంటర్టైనింగ్గా కథనాన్ని నడిపించాడు.
చిత్తూరు గ్రామీణ వాతావరణం, అక్కడ ప్రజల అలవాట్లను పరిచయం చేస్తూ కథను ప్రారంభించాడు దర్శకుడు. ఊర్లో జాతరకు టీవీ తీసుకురావడం.. టీవీ చూసేందుకు ఊరంతా ఒక చోటికి రావడం.. చిన్న చిన్న తగాదాలు, లవ్ ట్రాక్తో ఫస్టాఫ్ అంతా ఎంటర్టైనింగ్గా సాగుతుంది. అయితే పాత్రల పరిచయానికే ఎక్కువ సమయం తీసుకోవడంతో.. కొంతవరకు సాగదీసినట్లుగా అనిపిస్తుంది. టీవీని దొంగిలించారనే విషయం తెలిసినప్పటి నుంచి కథలో సంఘర్షణ మొదలవుతుంది.
అదే సమయంలో సతీష్-శారదల లవ్స్టోరీ రాజప్పకు తెలియడం.. హీరో సవాల్ చేయడంతో కథ మరింత రసవత్తరంగా మారుతుంది. టీవీ దొంగతనం చేసినవాడిని హీరో ఎలా కనిపెట్టాడు అనేదే ద్వితియార్థం కథ. ఆ దొంగ ఎవరనేది ప్రేక్షకుడు కూడా చివరివరకు కనిపెట్టకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డాడు. క్లైమాక్స్లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ఆకట్టుకోవడంతో పాటు ఆలోచింపజేస్తాయి. ఓవరాల్గా తిమ్మరాజుపల్లి టీవీ.. 80-90 తరాలకు పాత జ్ఞాపకాలను గుర్తుకు తెస్తుంది.
ఎవరెలా చేశారంటే..
ఇందులో నటించినవారంతా కొత్తవాళ్లే అయినా కూడా చక్కగా నటించారు. హీరోగా సాయి తేజ్, హీరోయిన్గా వేద జలంధర్ తమ పరిధి మేరకు చాలా బాగా నటించారు. వీరిద్దరి ఆన్స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ప్రదీప్ కొట్టే, స్వాతి కరిమిరెడ్డి, అమ్మ రమేష్ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. అందరూ చిత్తూరు యాసలో అద్భుతంగా మాట్లాడారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. వంశీకాంత్ రేఖన సంగీతం ఈ సినిమాకు మరో అదనపు బలం. తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశాడు. అక్షయ్ రామ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాతగానూ కిరణ్ అబ్బవరం తన మార్క్ చూపించాడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నతంగా ఉన్నాయి.


