
సోలో హీరోగా ఈ ఏడాది సిల్వర్ స్క్రీన్ను మిస్ చేసుకుంటున్న హీరోలు
ఎప్పటి కప్పుడు తమ ఫ్యాన్స్ కోసం సరికొత్త సినిమాలు చేయాలని, స్క్రీన్పై సరికొత్తగా కనిపించాలని హీరోలు ప్రయత్నిస్తూనే ఉంటారు. ఈ క్రమంలో కొన్ని సార్లు సమయం పట్టొచ్చు. ఇలా ఓ ఏడాది, రెండు మూడేళ్లు కొందరు హీరోలు సిల్వర్ స్క్రీన్ను మిస్ కావొచ్చు. అలా ఈ ఏడాది ఇప్పటికే కొంతమంది సిల్వర్ స్క్రీన్ను మిస్ కానున్నారు. అలా సోలో హీరోగా ఈ ఏడాది థియేటర్స్కు రాని కొందరు హీరోల గురించి ఓ లుక్ వేద్దాం.
కథలు వింటున్నారు...
‘నా సామిరంగ’ సినిమాతో గత ఏడాది సంక్రాంతికి థియేటర్స్కు వచ్చి సూపర్డూపర్ హిట్ అందుకున్నారు నాగార్జున. అయితే ఈ మూవీ తర్వాత నాగార్జున సోలో హీరోగా మరో మూవీపై ఇంకా సరైన స్పష్టత రాలేదు. యువ దర్శకులు నవీన్, కార్తీక్ చెప్పిన కథలను నాగార్జున విన్నారనే వార్తలు వచ్చాయి. ఇటీవల మరో యువ దర్శకుడు చెప్పిన కథను కూడా నాగార్జున విన్నారన్న వార్తలు ఫిల్మ్ నగర్ సర్కిల్స్లో వినిపించాయి.
కానీ ఇప్పటివరకైతే నాగార్జున సోలో హీరో మూవీ అనౌన్స్మెంట్ రాలేదు. ఇలా ఈ ఏడాది నాగార్జున సోలో హీరోగా నటించే మూవీ థియేటర్స్కు రాకపోవచ్చని ఊహించవచ్చు. అయితే నాగార్జున అభిమానులు నిరాశపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాగార్జున ఓ లీడ్ రోల్లో నటించిన ‘కుబేర’ (ఇందులో ధనుష్ హీరో), ‘కూలీ’ (రజనీకాంత్ హీరో) చిత్రాలు ఈ ఏడాదే స్క్రీన్పైకి వస్తాయి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలోని ‘కుబేర’ సినిమా జూన్ 20న విడుదల కానుంది. అలాగే లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలోని ‘కూలీ’ మూవీ ఆగస్టు 14న విడుదల కానుంది.
రెండేళ్లు ఆగాల్సిందే...
గత ఏడాది సంక్రాంతికి ‘గుంటూరు కారం’ సినిమాతో సందడి చేశారు మహేశ్బాబు. ఆ తర్వాత వెంటనే రాజమౌళితో మూవీ ప్రకటించారు. ఈ మూవీ అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతోంది. క్వాలిటీ, కంటెంట్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు మహేశ్బాబు, రాజమౌళి. దీంతో సహజంగానే ఈ మూవీ థియేటర్స్లోకి రావడానికి సమయం పడుతుంది. పైగా రాజమౌళితో మూవీ అంటే కనీసం రెండేళ్లైనా పడుతుంది.
ఇలా ఈ ఏడాది, వచ్చే ఏడాది మహేశ్బాబు స్క్రీన్పై కనిపించే అవకాశాలు లేనట్లే. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. రెండు కీలక షెడ్యూల్స్ చిత్రీకరణ జరిగింది. వేసవి సమయం కావడంతో ఫ్యామిలీతో కలిసి వెకేషన్కు వెళ్లారు మహేశ్బాబు. ఇటు ‘ఆర్ఆర్ ఆర్’ (ఎన్టీఆర్–రామ్చరణ్లు హీరోలుగా నటించిన మూవీ) మూవీపై తీసిన ‘ఆర్ఆర్ఆర్: బిహైండ్ అండ్ బియాండ్’ డాక్యుమెంటరీ ప్రమోషన్స్లో భాగంగా రాజమౌళి జపాన్లో ఉన్నారు. రాజమౌళి, మహేశ్బాబు విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ మూవీ షూట్ మళ్లీ ప్రారంభం అవుతుందని ఊహించవచ్చు.
కాగా ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదలవుతుందనే ప్రచారం సాగింది. కానీ అలాంటిది ఏమీ లేదని, ఒకటే మూవీగానే విడుదలవుతుందని ఫిల్మ్నగర్ సమాచారం. అంతేకాదు... 2027 మార్చి 25న ఈ సినిమాని రిలీజ్ చేసే ఆలోచనల్లో రాజమౌళి అండ్ టీమ్ ఉన్నారనే ప్రచారం తెరపైకి వచ్చింది. ఈ ప్రకారం మహేశ్బాబు సిల్వర్స్క్రీన్పై కనిపించేందుకు రెండేళ్లు ఆయన అభిమానులు ఎదురుచూడక తప్పేలా లేదు. ఈ మూవీని దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇతర లీడ్ రోల్స్లో నటిస్తున్నారు.
రాజాసాబ్ రానట్లే...
ప్రస్తుతం ‘ది రాజా సాబ్, ఫౌజి’ సినిమాల చిత్రీకరణలతో ప్రభాస్ చాలా బిజీగా ఉన్నారు. దాదాపు రెండు సంవత్సరాలుగా ‘ది రాజా సాబ్’ సినిమాతో ప్రయాణం చేస్తున్నారు ప్రభాస్. మారుతి దర్శకత్వంలోని ఈ హారర్ కామెడీ ఫిల్మ్ ఏప్రిల్ 10న విడుదల కావాల్సింది. కానీ రిలీజ్ కాలేదు. ఈ సినిమాకి సంబంధించి కొద్దిగా షూటింగ్ బ్యాలెన్స్ ఉందని, ఇంకా సాంగ్స్ చిత్రీకరించాల్సి ఉందని ఈ చిత్రదర్శకుడు మారుతి ఇటీవల పేర్కొన్నారు.
పైగా ‘ది రాజా సాబ్’ మూవీ కోసం ముందుగా అనుకున్న పాటలను క్యాన్సిల్ చేసి, ఇప్పటి ట్రెండ్కు తగ్గట్లుగా కొత్త పాటలను కంపోజ్ చేస్తున్నట్లుగా ఈ చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇటీవల ఓ సందర్భంలో తెలిపారు. ఇంకా షూటింగ్ పూర్తి కాకపోవడం, సాంగ్స్ బ్యాలెన్స్ ఉండటం, పైగా భారీగా వీఎఫ్ఎక్స్ చేయాల్సి ఉండటం వల్ల ‘ది రాజా సాబ్’ సినిమా ఈ ఏడాది థియేటర్స్కు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ప్రభాస్ చేస్తున్న మరో మూవీ ‘ఫౌజి’ చిత్రీకరణ ఇంకా చాలా బ్యాలెన్స్ ఉంది.
సో... ఈ మూవీ 2026లో రిలీజయ్యే పరిస్థితి కనిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ పీరియాడికల్ మూవీని నిర్మిస్తున్నారు. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ పూర్తిగా నిరాశపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే... విష్ణు మంచు హీరోగా చేసిన ‘కన్నప్ప’ సినిమాలో ఓ కీలక పాత్రలో ప్రభాస్ నటించారు. ఈ సినిమా ఈ ఏడాది జూన్ 27న రిలీజ్ కానుంది. ఈ విషయం ప్రభాస్ ఫ్యాన్స్కు కాస్త ఊరట కలిగించే అంశమనే చెప్పవచ్చు.
డ్రాగన్ వచ్చేది వచ్చే ఏడాదే...
గత ఏడాది ‘దేవర’ మూవీ తొలి భాగం ‘దేవర: పార్ట్ 1’తో సూపర్ సక్సెస్ అందుకున్నారు ఎన్టీఆర్. ఆ తర్వాత హిందీ మూవీ ‘వార్ 2’తో ఎన్టీఆర్ ఫుల్ బిజీ అయిపోయారు. హృతిక్ రోషన్ హీరోగా, ఎన్టీఆర్ మరో మెయిన్ లీడ్ రోల్లో నటిస్తున్న ఈ హిందీ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఆదిత్యా చోప్రా నిర్మాత. ఈ ‘వార్ 2’ మూవీ ఈ ఏడాది ఆగస్టు 14న విడుదల కానుంది. ఇక ఎన్టీఆర్ సోలోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ‘ఎన్టీఆర్నీల్’ (వర్కింగ్ టైటిల్) మూవీ అనౌన్స్మెంట్ రెండేళ్ల క్రితమే వచ్చింది.
కానీ ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఈ ఏడాది ఫిబ్రవరి 20న మొదలైంది. ఈ నెల 22 నుంచి ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటారు ఎన్టీఆర్. ఈ సినిమాని వచ్చే ఏడాది జనవరి 9న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. కానీ ఈ మూవీ రిలీజ్ ఏప్రిల్కి వాయిదా పడిందనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా మూవీకి ‘డ్రాగన్’ అనే టైటిల్ అనుకుంటున్నారని సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్గా కన్నడ నటి రుక్ష్మిణీ వసంత్, మరో లీడ్ రోల్లో టొవినో థామస్ నటించనున్నారని తెలిసింది.
మళ్లీ గ్యాప్...
‘పుష్ప’ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన ‘పుష్ప: ది రైజ్, పుష్ప: ది రూల్’ సినిమాల సక్సెస్తో అల్లు అర్జున్ మంచి జోష్లో ఉన్నారు. ముఖ్యంగా ‘పుష్ప: ది రూల్’ చిత్రం బ్లాక్బస్టర్గా నిలవడం, సరికొత్త బాక్సాఫీస్ రికార్డులను క్రియేట్ చేసినట్లుగా మేకర్స్ వెల్లడించడం అనేవి అల్లు అర్జున్ కాన్ఫిడెన్స్ను మరింత పెంచినట్లున్నాయి. అయితే ‘పుష్ప: ది రైజ్’ మూవీ విడుదలైన మూడు సంవత్సరాల తర్వాత కానీ... ‘పుష్ప: ది రూల్’ సినిమా థియేటర్స్లోకి రాలేదు.
ఇలా అల్లు అర్జున్ను స్క్రీన్పై చూసుకునేందుకు ఆయన అభిమానులు మూడు సంవత్సరాలు వెయిట్ చేశారు. కాగా మళ్లీ అల్లు అర్జున్ను స్క్రీన్పై చూసేందుకు మరో రెండు సంవత్సరాలు వెయిట్ చేయక తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి. అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీని తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించనున్నారు. కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించనున్న ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో రూపొందనుంది. ఈ చిత్రం కోసం ఓ సరికొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేయనున్నారట అట్లీ. భారీగా వీఎఫ్ఎక్స్ చేయాల్సి ఉంటుందట.
పైగా ఈ సినిమా ఇంకా సెట్స్పైకి వెళ్లలేదు. ఇలాంటి ఎన్నో కారణాల వల్ల అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీ మరో రెండు సంవత్సరాలు థియేటర్స్లోకి రాదని ఊహించవచ్చు. అలాగే 2018లో ‘నా పేరు సూర్య... నా ఇల్లు ఇండియా’ సినిమా తర్వాత అల్లు అర్జున్ హీరోగా నటించిన మరో మూవీ ‘అల... వైకుంఠపురములో..’ 2020లో విడుదలైంది. ఈ గ్యాప్ గురించి, ‘గ్యాప్... ఇవ్వలా వచ్చింది’ అన్నట్లుగా అల్లు అర్జున్ అప్పట్లో పేర్కొన్నారు. ఇలా మరోసారి అల్లు అర్జున్ కెరీర్లో మళ్లీ గ్యాప్ క్రియేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇలా ఈ ఏడాది సోలో హీరోగా సిల్వర్ స్క్రీన్ని మిస్ చేసుకోనున్న హీరోలు మరికొందరు ఉన్నారు. – ముసిమి శివాంజనేయులు