Some Directors Call That Jamuna Arrogant - Sakshi
Sakshi News home page

Jamuna: జమున చాలా పొగరుబోతు, ఇంట్లోకి కూడా రానివ్వదు!

Jan 28 2023 9:13 AM | Updated on Jan 28 2023 12:37 PM

Some Directors Call That Jamuna Arrogant - Sakshi

కొందరు దర్శక–నిర్మాతలు జమున ఇంటి వరకు వచ్చీ.. ఆమెను కలవకుండానే వెళ్లిపోవాల్సి వచ్చేది. ‘జమున చాలా పొగరుబోతు.. ఇంట్లోకి కూడా రానివ్వదు’ అని చెప్పుకునేవారట.

తెలుగువారి తొలి గ్లామర్‌ స్టార్‌ కాంచన మాల. తర్వాతి గ్లామర్‌ స్టార్‌ జమున. ఎవరి పక్కనైనా అందంగా సరిపోయే స్టార్‌గా జమున తెలుగు సినిమా పరిశ్రమలో దాదాపు 25 ఏళ్లు ఏలింది. హరనాథ్‌తో ‘లేత మనసులు’ పెద్ద హిట్‌ సాధించింది. అందులోని ‘హలో మేడమ్‌ సత్యభామా’, ‘అందాల ఓ చిలుకా అందుకో నా లేఖ’ పాటల్లో జమున జాంపండులా ఉందని ప్రేక్షకులు మురిసిపోయారు.  ఒక సీనియర్‌ హీరోయిన్‌ అయి ఉండి, పెద్ద స్టార్‌ అయి ఉండి చలంతో ‘మట్టిలో మాణిక్యాలు’ హిట్‌ కొట్టింది జమున. అందులో ‘నా మాటే నీ మాటై చదవాలి’ పాట అతి మధురం. ముచ్చటం. ఫీల్డ్‌కు వచ్చిన కొత్తల్లో జమునను ‘హంపీ సుందరి’ అని, ‘ఆంధ్రా నర్గిస్‌’ అని పిలిచేవారు. చిత్రంగా నర్గిస్‌కు చిరఖ్యాతి తెచ్చి పెట్టిన ‘మదర్‌ ఇండియా’ను జమునే తెలుగులో చేసింది. ఆ సినిమా పేరు ‘బంగారు తల్లి’.

పొగరుబోతు అనే పేరు ఎందుకు?
ఇండస్ట్రీలో మరింత మెరుగ్గా రాణించే క్రమంలో మద్రాస్‌కు మకాం మార్చారు జమున కుటుంబ సభ్యులు. అయితే ఓ సినిమాలో జమునకు అవకాశం ఇస్తామన్నట్లుగా ఆమె తండ్రి శ్రీనివాసరావును కొందరు అజ్ఞాతవ్యక్తులు కారులో తీసుకుని వెళ్లారు. కొంతదూరం ప్రయాణించిన తర్వాత వారిపై ఆయనకు అనుమానం రావడంతో సిగరెట్ల సాకుతో వారి నుంచి ఎలాగో తప్పించుకున్నారు. అదే సమయంలో ఇంట్లో ఉన్న తన కుటుంబసభ్యులకు ఏమైనా ఆపద కలిగిందా? అని చాలా కంగారుపడ్డారట జమున తండ్రి.

ఈ ఘటన తర్వాత తాను ఇంట్లో లేనప్పుడు ఇంటికి ఎవరొచ్చినా తలుపు తెరవొద్దని, అవసరమైతే కీటికీలోనుంచి చూసి, తెలిసిన వారైతేనే తలుపు తీయమని, ముఖ్యంగా తెలియనివారైతే తాను ఇంట్లో ఉన్నప్పుడే రమ్మని చెప్పాలన్నట్లుగా కుటుంబసభ్యులకు చెప్పారట శ్రీనివాసరావు. దీంతో తండ్రి చెప్పినట్లే చేశారట జమున. ఈ కారణంగా కొందరు దర్శక–నిర్మాతలు జమున ఇంటి వరకు వచ్చీ.. ఆమెను కలవకుండానే వెళ్లిపోవాల్సి వచ్చేది. అయితే అసలు విషయం తెలియని కొందరు దర్శక–నిర్మాతలు ‘జమున చాలా పొగరుబోతు.. ఇంట్లోకి కూడా రానివ్వదు’ అని చెప్పుకునేవారట.

తమిళ్‌తో అనుబంధం
కథానాయికగా జమున తెలుగు సినిమా ద్వారా పరిచయమైనప్పటికీ తమిళ సినిమాకూ ఎనలేని సేవలు అందించారు. దివంగత మహానటులు ఎంజీఆర్, శివాజీ గణేశన్ , జెమినీ గణేశన్  వంటి వారితో జమున నటించి ఆకట్టుకున్నారు. ‘పణం పడత్తుం పాడు’ (1954) చిత్రంతో కోలీవుడ్‌కి పరిచయం అయ్యారు జమున. ‘మిస్సియమ్మ (మిస్సమ్మ), తెనాలి రామన్, తంగమలై రహస్యం, తిరుట్టు రామన్, నాళయ తీర్పు వంటి పలు విజయవంతమైన చిత్రాలు జమున ఖాతాలో ఉన్నాయి. ఇక క్యారెక్టర్‌ నటిగా ‘తూంగాదే తంబి తూంగాదే’ చిత్రంలో కమల్‌హాసన్‌కు తల్లిగా నటించారామె. అప్పట్లో తమిళ పరిశ్రమలో హీరోలకు సమానంగా పారితోషకం పొందిన సావిత్రి తర్వాత ఆ స్థాయిలో అందుకున్న నటి జమున కావడం విశేషం.

చదవండి: జమున బయోపిక్‌లో తమన్నా భాటియా?
కూతుర్ని హీరోయిన్‌గా చూడాలనుకున్న జమున

Advertisement
 
Advertisement
Advertisement