భారతీయ సనాతన ధర్మంలో దాగి ఉన్న రహస్యాలను ఆధారంగా చేసుకుని రూపొందిన మైథలాజికల్ ఫిక్షనల్ థ్రిల్లర్ ‘త్రికాల’ మే 29న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. హీరోయిన్ శ్రద్ధదాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో మాస్టర్ ఫేమ్ మహేంద్రన్, అజయ్, సీనియర్ నటి ఆమని కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి మణి తెల్లగూటి కథ, దర్శకత్వం వహించగా, రాధిక–శ్రీనివాస్ నిర్మించారు. చాగంటి ప్రొడక్షన్ ఎల్ఎల్బి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతుంది.
ఇటీవలి కాలంలో మైథలాజికల్ టచ్తో వచ్చిన థ్రిల్లర్ చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుండటంతో ‘త్రికాల’పై కూడా ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ మొదలైంది. ఆధునిక సాంకేతికతతో రూపొందించిన హైక్వాలిటీ వీఎఫ్ఎక్స్ ఈ సినిమాకు ప్రధాన బలం కానుందని చిత్రబృందం చెబుతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, ప్రచార చిత్రాలు, పాటలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ముఖ్యంగా మాస్టర్ మహేంద్రన్ యాక్షన్ సీక్వెన్స్లు, అజయ్ పవర్ఫుల్ పాత్ర, శ్రద్ధాదాస్ కొత్త లుక్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి.
ఈ సందర్భంగా దర్శకుడు మణి తెల్లగూటి మాట్లాడుతూ…“ప్రపంచంపై చీకటి కమ్ముకున్న సమయంలో వెలుగుగా అవతరించే శక్తి చుట్టూ ‘త్రికాల’ కథ తిరుగుతుంది. భారతీయ సనాతన ధర్మంలో దాగి ఉన్న కొన్ని ఆధ్యాత్మిక రహస్యాలను థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో మిళితం చేసి తెరకెక్కించాం. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ప్రేక్షకులకు ‘త్రికాల’ ఒక కొత్త అనుభూతిని అందిస్తుందనే నమ్మకం ఉంది” అని తెలిపారు.
నిర్మాతలు మాట్లాడుతూ… సరికొత్త కాన్సెప్ట్తో, మైథలాజికల్ టచ్తో రూపొందిన ‘త్రికాల’ ప్రతి వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సంస్కృతి, ఆధ్యాత్మికత, ఆసక్తి.. వంటి అంశాలు కలిసిన ఈ కథ ప్రేక్షకులకు కొత్త ఫీలింగ్ ఇస్తుంది’ అని పేర్కొన్నారు.ఈ సినిమాకు హర్షవర్ధన్ రమేశ్వర్ సంగీతం అందిస్తున్నారు.


