నుదుటిన బొట్టుతో షారుక్‌.. ట్రోలింగ్‌

Shah Rukh Khan Trolled For Visarjan Post Ganesh Chaturthi 2020 - Sakshi

ముంబై: ‘‘ప్రార్థనలు, నిమజ్జనం పూర్తయ్యాయి. గణేశ మీపై, మీ కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ఆశీర్వాదాలు కురిపించాలి. సంతోషాన్నివ్వాలి. గణపతి బప్పా మోరియా’’అంటూ బాలీవుడ్‌ బాద్‌ షా షారుక్‌‌ ఖాన్ సోమవారం అభిమానులకు శుభాకాంక్షలు తెలిపాడు. నుదుటిన కుంకుమ ధరించి ఉన్న బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోను ఈ సందర్భంగా షేర్‌ చేశాడు. ఇప్పటికే సుమారు పద్నాలుగున్నర లక్షలకు పైగా లైకులు సాధించిన ఈ ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అయితే ఎప్పటిలాగే కొంతమంది నెటిజన్లు కింగ్‌ ఖాన్‌పై ట్రోలింగ్‌కు దిగడం మొదలుపెట్టారు. (రామ మందిరానికి షారుక్ రూ.5 కోట్ల విరాళం?)

‘‘సర్‌ మీరు ఇన్నాళ్లు ముస్లిం అనుకున్నానే. తప్పుగా భావించినందుకు క్షమించండి. మీరు ఏ వర్గానికి చెందిన వారో కాస్త క్లారిటీ ఇవ్వండి’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. మరికొంత మంది మాత్రం.. ‘‘అది నిజంగా కుంకుమ బొట్టేనా? లేదా పెయింట్‌ ఆ? దేవుడితో ఆటలాడితే శాపం పెడతాడు’’అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక షారుక్‌ ఫ్యాన్స్‌ మాత్రం.. ‘‘ప్రతీ ఏడాది వినాయక చవితిలాగే ఈసారి కూడా మమ్మల్ని సర్‌ప్రైజ్‌ చేశావు. ఎంతైనా నీకెవరూ సాటి రారు. మనసున్న మంచి వ్యక్తివి నువ్వు’’అంటూ అభిమానం చాటుకుంటున్నారు. (జియో సిమ్‌ యాడ్: షారుఖ్‌ స్థానంలో అక్షయ్‌?!)

కాగా గతంలో తన చిన్న కుమారుడు అబ్‌రాం గణనాథునికి దండం పెట్టుకున్న ఫొటోను షేర్‌ చేసిన షారుఖ్‌ ట్రోలింగ్‌ బారిన పడిన సంగతి తెలిసిందే. కులమతాలకు అతీతంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న గౌరీ- షారుక్‌‌ దంపతులకు ముగ్గురు పిల్లలు ఆర్యన్‌, సుహానా, అబ్‌రాం ఉన్న విషయం విదితమే. ఇదిలా ఉండగా.. బాలీవుడ్‌ సెలబ్రిటీలు శ్రద్ధా కపూర్‌, శిల్పాశెట్టి ఆదివారమే తమ ఇంట్లో ప్రతిష్టించుకున్న బొజ్జ గణపయ్యను నిమజ్జనం చేసి లంబోదరుడికి వీడ్కోలు పలికారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top