దేశవ్యాప్తంగా రయ్‌ రయ్‌మంటూ ‘పెద్ది’ ప్రచారం | Ram Charan Peddi Promotions campaign starts from 18th May | Sakshi
Sakshi News home page

దేశవ్యాప్తంగా రయ్‌ రయ్‌మంటూ ‘పెద్ది’ ప్రచారం

May 14 2026 11:33 PM | Updated on May 15 2026 12:08 AM

Ram Charan Peddi Promotions campaign starts from 18th May

రామ్ చరణ్- బుచ్చిబాబు సాన కాంబోలో వస్తోన్న మోస్ట్ ‍అవైటేడ్ మూవీ ‘పెద్ది’. ఈ సినిమాకు సంబంధించిన ప్రచారం రయ్‌ రయ్‌ మంటూ మొదలుకానుంది. ఇప్పటివరకు నిశ్శబ్దంగా సాగిన ప్రమోషన్లు మే 18 నుంచి వేగం అందుకోనున్నాయి. జూన్‌ 2 వరకు దశలవారీగా భారీ ఈవెంట్లు ప్లాన్‌ చేసినట్లు యూనిట్‌ ప్రకటించింది.  ముందుగా మే 18న ముంబయిలో ట్రైలర్‌ లాంచ్‌ జరగనుంది. ఈ కార్యక్రమానికి చరణ్‌ హాజరవుతాడు. ఆ తర్వాత మే 22న హైదరాబాద్‌ ఉప్పల్‌లో మరో భారీ ప్రచార కార్యక్రమం షెడ్యూల్‌ చేశారు. దీనికి కూడా చరణ్‌ హాజరవుతాడు. 

ఆ మరుసటి రోజు, అంటే మే 23న భోపాల్‌లో స్పెషల్‌ సాంగ్‌ రిలీజ్‌ జరగనుంది. మొదట భోపాల్‌లోనే ట్రైలర్‌ లాంచ్‌ చేయాలని అనుకున్నారు కానీ ప్లాన్‌ మార్చి అక్కడ పాట విడుదలకు నిర్ణయించారు. శృతిహాసన్‌, చరణ్‌పై చిత్రీకరించిన స్పెషల్‌ సాంగ్‌ను భోపాల్‌లో రిలీజ్‌ చేయనున్నారు. అయితే ఆ ఈవెంట్‌కు చరణ్‌ హాజరవ్వడం లేదట. శృతిహాసన్‌ మాత్రమే పాల్గొననుందని సమాచారం. ఇక తదుపరి ప్రచార కార్యక్రమాల విషయానికి వస్తే.. మే 24న బెంగళూరులో, మే 28న ఢిల్లీలో, మే 30న చెన్నైలో ఈవెంట్లు జరుగుతాయని సమాచారం. జూన్‌ 1న ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో ఓ ప్రత్యేక కార్యక్రమం ప్లాన్‌ చేస్తున్నారట. అలాగే జూన్‌ 2న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రీ-రిలీజ్‌ ఫంక్షన్‌ జరగనుంది. జూన్‌ 3న ప్రీమియర్స్‌తో ‘పెద్ది’ సందడి థియేటర్లలో మొదలవనుంది.  

ప్రస్తుతానికి యూనిట్‌ అనుకుంటున్న ప్రమోషనల్‌ ప్లాన్‌ ఇదే. అయితే రాబోయే రోజుల్లో ఈ షెడ్యూల్‌లో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది. ఇందులో చరణ్‌ ఎన్ని ఈవెంట్లకు హాజరవుతాడనే అంశంపై కూడా త్వరలోనే స్పష్టత రానుంది. మొత్తంగా, మే 18 నుంచి జూన్‌ 2 వరకు దేశవ్యాప్తంగా ‘పెద్ది’ ప్రచారం రయ్‌ రయ్‌మంటూ సాగనుంది. అభిమానుల్లో ఆసక్తి పెంచేలా యూనిట్‌ వ్యూహాత్మకంగా కార్యక్రమాలను అమలు చేస్తోంది. 

Advertisement
 
Advertisement
Advertisement