కోలీవుడ్ నటి వనితా విజయ్కుమార్ గురించి తెలుగువారికి పరిచయం అక్కర్లేదు. తమిళంతో పాటు తెలుగులోనూ చాలా సినిమాలు చేసింది. 1999లోనే దేవి మూవీలో తెలుగు సినీ ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ఆమె కూతురు సైతం టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. గతేడాది తమిళ బిగ్బాస్ కంటెస్టెంట్గా పాల్గొన్న జోవిక ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఎంఎస్ రాజు దర్శకత్వంలో వస్తోన్న అగధ మూవీలో హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ టీజర్ లాంఛ్ ఈవెంట్ను హైదరాబాద్లో నిర్వహించారు.
ఈ సందర్భంగా దర్శకుడు, నిర్మాత అయిన ఎంఎస్ రాజు మాట్లాడారు. 1999లో వచ్చిన దేవి మూవీ గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. దేవి సినిమా షూటింగ్లో వనిత విజయ్ కుమార్ను పాము కాటేసిందని తెలిపారు. అప్పుడు మేమంతా తెగ కంగారు పడిపోయామని వెల్లడించారు. కానీ వనితా మాత్రం ఎలాంటి భయం లేకుండా అమ్మవారే తనను కాపాడుతుందని చెప్పిందని గుర్తు చేసుకున్నారు. ఆమె ఎంత ధైర్యవంతురాలో చెప్పాలంటే ఈ ఒక్క సంఘటన చాలని ఎంఎస్ రాజు ప్రశంసలు కురిపించారు. కాగా.. 1999లో వచ్చిన దేవి సినిమాకు ఎంఎస్ రాజు నిర్మాతగా ఉన్నారు.
ఈ చిత్రాన్ని ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో మిస్టికల్ డివైన్ థ్రిల్లర్గా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో హరిణి పాత్రలో జోవిక కనిపించనుంది. ఈ చిత్రంలో హీరోయిన్ కామాక్షీ భాస్కర్ల ప్రధాన పాత్ర పోషించారు. శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్పై కాశీ విశాలాక్షి బలుసు నిర్మిస్తున్నారు. ఈ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో త్వరలో విడుదల కానుంది. ఈ మూవీలో కామాక్షీ భాస్కర్ల మహాదేవి పాత్రలో కనిపించనుంది.


