మెగా డాటర్ నిహారిక నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. సొంతంగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అనే బ్యానర్ని స్థాపించి, 2024లో ‘కమిటీ కుర్రోళ్లు’ అనే సినిమాను నిర్మించారు. తొలి సినిమానే సూపర్ హిట్ అయింది. భారీ కలెక్షన్స్తో పాటు బోలెడు అవార్డులను తెచ్చిపెట్టింది. కాస్త గ్యాప్ తీసుకొని రెండో చిత్రంగా ‘రాకాస’ అనే హారర్ కామెడీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. మానస శర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు. ఈ సినిమాను ఏప్రిల్ 3న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ సినిమా టీజర్ని ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో.. తన సినీ జర్నీ గురించి నిహారిక ఆసక్తికర విషయాలను పంచుకుంది. కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం తీసుకోకుండానే చిత్రాలను నిర్మిస్తున్నానని నిహారిక చెప్పింది.
‘నేను యాంకర్గా 2015లో ఢీ జూనియర్ షో చేశా. అప్పుడు నాకు 20 ఏళ్లు. అప్పటి నుంచే మా నాన్న దగ్గర డబ్బులు తీసుకోవడం ఆపేశా. తండ్రిగా ఆయన నాకు అప్పుడప్పుడు పాకెట్ మనీ ఇస్తాడు. అది ఆయనకు నాపై ఉన్న ప్రేమ మాత్రమే. అందుకే తీసుకుంటాను. అంతేకాని సినిమాలను నిర్మించేంత డబ్బులను మా నాన్న నుంచి తీసుకోలేదు’ అని నిహారిక చెప్పుకొచ్చింది.
సొంత బ్యానర్లో ఎందుకు నటించడం లేదని ఓ రిపోర్టర్ ప్రశ్నించగా.. ‘నాకు ఎవరైనా కథ చెప్పడానికి వచ్చినప్పుడు.. నేనే నటించాలి అనే కండీషన్ పెట్టను. ముందు కథ వింటాను. దానికి సెట్ అయ్యే నటీనటులను మాత్రమే తీసుకుంటాం.అంతేకానీ.. ఈ సినిమాలో నన్నే హీరోయిన్గా పెట్టుకోవాలని అని కండీషన్ పెట్టను. ఒకవేళ వాళ్లు చెప్పే కథకు నేనే సెట్ అవుతాను అనుకుంటే కచ్చితంగా నటిస్తాను. ఇప్పటి వరకు మాత్రం నా దగ్గరకు అలాంటి కథలు రాలేదు. అందుకే నటించలేదు’ అని నిహారిక చెప్పుకొచ్చింది.
ఇక సినిమాల్లోకి వస్తానంటే ఇంట్లోవాళ్ల రియాక్షన్ ఏంటి అని మరో రిపోర్టర్ అడగగా.. ‘నేను ముందుగా డాక్టర్ అవుదాం అనుకున్నా. ఈ విషయాన్ని ఇంట్లో చెబితే..వద్దని చెప్పారు. అందులో ఉండే మంచి, చెడులను వివరించారు. మా బంధువులలో కొంతమంది డాక్టర్లు ఉన్నారు. వాళ్లు కూడా ‘వద్దు..కష్టంగా ఉంటుంది’ అన్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకు సినిమాల్లోకి వస్తానని చెప్పా. అప్పుడు కూడా ఇంట్లోవాళ్లు.. ఇండస్ట్రీలో ఉండే మంచి, చెడులను వివరించారు. ఆ తర్వాత నీ ఇష్టం అని మాత్రమే చెప్పారు. డాక్టర్ కంటే యాక్టర్ అవ్వడమే కాస్త ఈజీ అనిపించింది. అందుకే సినిమాల్లోకి వచ్చేశా’ అని నిహారిక చెప్పుకొచ్చింది.


