కోలీవుడ్ హీరో సూర్య నటించిన లేటేస్ట్ యాక్షన్ మూవీ కరుప్పు. ఈ సినిమాకు ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా రిలీజ్కు అంతా సిద్ధమైంది. తెలుగులో వీరభద్రుడు పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. ఈవెంట్కు హాజరైన డైరెక్టర్ బాలాజీ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
ఈ సినిమా థియేటర్లకు వచ్చే వారికోసమే తీశామని అన్నారు. అంతేకానీ సోషల్ మీడియాలో సమీక్షించే వారి కోసం కాదన్నారు. దీంతో దర్శకుడు బాలాజీ కామెంట్స్పై పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. ఆన్లైన్ సినిమాలను విశ్లేషించే వారిని కించపరిచేలా మాట్లాడారంటూ ట్రోల్స్ చేశారు. దీంతో తన వ్యాఖ్యలపై స్పందించారు. కేరళలో నిర్వహించిన మూవీ ఈవెంట్లో తన కామెంట్స్పై క్లారిటీ ఇచ్చారు.
తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఆర్జే బాలాజీ అన్నారు. ఎలాంటి ముందస్తు అభిప్రాయం లేకుండా సినిమా చూడమని మాత్రమే తాను ప్రేక్షకులను కోరానని స్పష్టం చేశారు. సినిమాలపై చేసే సమీక్షలను, చర్చలను కొట్టిపారేయడం తన ఉద్దేశం కాదని తెలిపారు. ముందుగానే ఓ అభిప్రాయంతో థియేటర్లకు రావద్దని ప్రేక్షకులను కోరడమే నా ఉద్దేశమని వెల్లడించారు. మీరు విశాల దృక్పథంతో థియేటర్లకు వచ్చి.. సినిమా చూసిన తర్వాతే.. నచ్చిందో లేదో చెప్పాలని కోరుకుంటున్నానని అన్నారు. నా అభిప్రాయం ప్రకారం ఏదైనా ఒక ప్రొడక్ట్ మార్కెట్లోకి వచ్చాక.. ప్రతి ఒక్కరూ దాని గురించి మాట్లాడాలి.. సమీక్షించాలి. నేను కూడా ఒకప్పుడు సమీక్షకుడినే.. ఇప్పుడే డైరెక్టర్గా మారానని తెలిపారు.
సూర్య హీరోగా వస్తోన్న ఈ చిత్రంలో త్రిష కృష్ణన్ హీరోయిన్గా నటించారు. ఈ చిత్రంలో ఇంద్రన్స్, నట్టి సుబ్రమణ్యం, స్వాసిక, శ్శివద, అనఘ మాయ రవి, సుప్రీత్ రెడ్డి, యోగి బాబు, మన్సూర్ అలీ ఖాన్, జార్జ్ మరియన్, ఆడుకలం నరేన్, నమో నారాయణ, దీపా శంకర్, సభ మారన్ కీలక పాత్రల్లో కనిపించారు. కాగా.. ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందించారు. ఈ చిత్రం మే 14న థియేటర్లలో విడుదల కానుంది.


