‘‘ప్రేక్షకులు గత కొన్ని నెలలుగా థియేటర్లకు వస్తున్నారు. సినిమాలకు చాలా మంచి రన్ ఇస్తుండటం మంచి పరిణామం. అదే కంటిన్యూ అవుతూ ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా కూడా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అదే విధంగా సుమంత్ అన్నకి ‘గోదావరి’ చిత్రం కంటే ఈ సినిమాతో బిగ్ సక్సెస్ రావాలి’’ అని డైరెక్టర్ వెంకీ అట్లూరి చెప్పారు. సుమంత్ హీరోగా నటించిన చిత్రం ‘మహేంద్రగిరి వారాహి’. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఐశ్వర్యా రాజేష్, సిద్ధు జొన్నలగడ్డ, మీనాక్షి గోస్వామి, మాల్విక నాయర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్, బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్లపై లక్ష్మణ్, కాలిపు మధు నిర్మించిన ఈ సినిమా సెప్టెంబరు 11న రిలీజ్ కానుంది. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి వెంకీ అట్లూరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుమంత్ మాట్లాడుతూ– ‘‘సుబ్రహ్మణ్యపురం’ తర్వాత డైరెక్టర్ సంతోష్తో ఇది నా రెండో సినిమా. దాదాపు మూడేళ్ల జర్నీ ఇది. ఈ సినిమా విజయం పై మంచి నమ్మకం ఉంది’’ అన్నారు.
‘‘మా సినిమా థియేటర్లలో అద్భుతమైన అనుభూతిని అందించేలా ఉంటుంది’’ అని సంతోష్ జాగర్లపూడి చెప్పారు. కాలిపు మధు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా జర్నీలో వారాహి అమ్మవారు మాతోనే ఉన్నారని మా విశ్వాసం. షూటింగ్ అప్పుడు ఎన్నో అద్భుతాలు జరిగేవి’’ అని అన్నారు. సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, నటి మీనాక్షి గోస్వామి మాట్లాడారు.


