
తెలుగులో టాప్ డైరెక్టర్స్ అనగానే గుర్తొచ్చే పేరు త్రివిక్రమ్. రైటర్గా కెరీర్ మొదలుపెట్టిన ఈయన.. టాలీవుడ్లో స్టార్ హీరోలతో గుర్తుండిపోయే సినిమాలు ఎన్నో తీశారు. అలాంటి ఈయన పరిస్థితి ప్రస్తుతం అస్సలు బాగోలేదు. పేరుకే స్టార్ డైరెక్టర్ గానీ సరైన కాంబో సెట్ చేసుకోలేక పూర్తిగా కన్ఫ్యూజ్ అవుతున్నారు. దీంతో ఎలా ఉండే త్రివిక్రమ్ ఎలా అయిపోయారా అని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ అసలేం జరుగుతోంది?
త్రివిక్రమ్ పేరు చెప్పగానే కుటుంబ కథా చిత్రాలు, పంచ్లు, ప్రాస డైలాగ్స్ గుర్తొస్తాయి. కానీ అరవింద సమేత, అల వైకుంఠపురములో సినిమాల తర్వాత ఈయన.. దర్శకుడిగా పూర్తిగా గాడి తప్పారా అనిపిస్తుంది. ఎందుకంటే 'అల వైకుంఠపురములో' తర్వాత ఎన్టీఆర్తో ఓ మూవీ ప్లాన్ చేశారు. కానీ అది క్యాన్సిల్ అయిపోయింది. దీంతో మహేశ్ బాబుతో ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నారు. తొలుత ఓ సబ్జెక్ట్తో సినిమా మొదలుపెట్టారు గానీ కొన్నిరోజులకే దాన్ని పక్కనబెట్టి మరో కథతో సినిమా తీసి రిలీజ్ చేశారు. అదే 'గుంటూరు కారం'. మహేశ్ అభిమానులకు ఈ మూవీ నచ్చింది గానీ మిగతా వాళ్లకు పెద్దగా కనెక్ట్ కాలేదు.
(ఇదీ చదవండి: ఓటీటీలో లేటెస్ట్ హిట్ సినిమా.. డేట్ ఫిక్సయిందా?)
'గుంటూరు కారం' గతేడాది సంక్రాంతికి వచ్చింది. అప్పటి నుంచి త్రివిక్రమ్ ఖాళీగానే ఉంటున్నారు. మధ్యలో అల్లు అర్జున్తో ప్రాజెక్ట్ సెట్ అయింది. భారీ బడ్జెట్తో మైథలాజికల్ కథతో దీన్ని తీస్తున్నామని నిర్మాత నాగవంశీ కూడా పలుమార్లు చెప్పుకొచ్చారు. ఏమైందో ఏమో గానీ అల్లు అర్జున్.. దీన్ని పక్కనబెట్టి అట్లీతో సినిమా మొదలుపెట్టారు. ఫలితంగా త్రివిక్రమ్ పరిస్థితి మళ్లీ మొదటకొచ్చింది. ప్రస్తుతం ఖాళీగానే ఉన్నారు. రామ్ చరణ్, వెంకటేశ్తో సినిమాలు చేస్తారనే రూమర్స్ వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇవి చేసినా సరే టాలీవుడ్కే పరిమితమయ్యే మూవీస్ అవుతాయేమో?
త్రివిక్రమ్తో పాటు దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టిన రాజమౌళి, సుకుమార్ లాంటి చాలామంది డైరెక్టర్స్.. ప్రస్తుతం పాన్ ఇండియా రేసులో టాప్ స్పీడుతో దూసుకెళ్తున్నారు. త్రివిక్రమ్ మాత్రం ఇంకా ఏ హీరోతో మూవీ చేయాలా అని కన్ఫ్యూజ్ అవుతున్నారు. అటు దర్శకుడిగా ఎవరితో సినిమా చేయాలా అనే దగ్గర నుంచి బన్నీతో ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందా అనేది తెలియని పరిస్థితి. మరి ప్రస్తుత అడ్డంకులన్నీ దాటుకుని త్రివిక్రమ్ ఏం చేస్తారో చూడాలి?
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్)