రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. ఈ మూవీలో డానిష్ ఇక్బాల్.. బడే సాహెబ్ అలియాస్ దావూద్ ఇబ్రహీంగా నటించాడు. అయితే సినిమాలో తనను ఎక్కడ తీసేస్తారో అని తెగ భయపడిపోయానంటున్నాడు డానిష్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. ధురంధర్ 1 రిలీజయ్యాక సీక్వెల్లో బడే సాహెబ్గా ఎవరు కనిపించనున్నారని జనాల్లో ఆసక్తి మొదలైంది.
నన్ను తీసేశారనుకున్నా..
ఈ క్రమంలో ఎంతోమంది పేర్లు తెరపైకి వచ్చాయి. వారిలో సల్మాన్ ఖాన్, ఇమ్రాన హష్మీ పేర్లు కూడా ఉన్నాయి. అది చూసి ఒకరకంగా నేను చాలా భయపడ్డాను. బడే సాహెబ్ కోసం అప్పటికే నేను సెలక్ట్ అయ్యాను. కానీ నన్ను పక్కనపెట్టేశారేమో.. నా స్థానంలో పెద్ద స్టార్స్ను తీసుకుంటున్నారేమో అని కంగారుపడ్డాను. డైరెక్టర్ ఆదిత్య ధర్కు ఫోన్ చేసి కనుక్కుందామా? అని ఆందోళన చెందాను.
ఆ రెండు పాత్రలు ఒక్కటే అని తెలీదు
కానీ, తర్వాత అలాంటిదేం లేదని తెలిసి ఊపిరి పీల్చుకున్నాను. నిజానికి బడే సాహెబ్, దావూద్ ఇబ్రహీం ఒక్కరేనని నాకూ ముందు తెలీదు. నాది మంచానికే పరిమితమైన దావూద్ ఇబ్రహీం పాత్ర అని మాత్రమే తెలుసు. తర్వాత హీరో బడే సాహెబ్ కోసం వెతుకుతున్నప్పుడు ఆయనెవరని అందరూ ఆలోచించడం మొదలుపెట్టాం. పర్వీజ్ ముషారఫా? ఒసామా బిన్ లాడెనా? అనుకున్నాం. అదే సమయంలో దావూదే బడే సాహెబా? అన్న అనుమానమూ వచ్చింది. చివరకు అదే జరిగింది.
మేకప్ కోసం 12 గంటలు
ముసలి వయసులో ఉన్న దావూద్గా కనిపించడం కోసం దాదాపు ఏడెనిమిది గంటలు శ్రమించాల్సి వచ్చింది. ఆ ప్రోస్తటిక్ మేకప్ను తీసేందుకు కనీసం రెండుమూడు గంటలైనా పెట్టేది. అలా మేకప్కే 12 గంటల సమయం అయిపోయేది అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే మార్చి 19న రిలీజైన ధురంధర్ 2 కేవలం మూడు రోజుల్లోనే రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.


