మత్తు పదార్థాలను నివారిద్దాం: కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

మత్తు పదార్థాలను నివారిద్దాం: కలెక్టర్‌

Jul 23 2026 6:48 AM | Updated on Jul 23 2026 6:48 AM

బాలలతో పని చేయిస్తే కఠిన చర్యలు మెదక్‌జోన్‌: బాలలను పనిలో పెట్టుకుంటే చర్యలు తప్పవని ఎస్పీ శ్రీనివాసరావు హెచ్చరించారు. బుధవారం ఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్‌ ముస్కాన్‌లో భాగంగా ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 78 మంది చిన్నారులకు రక్షణ కల్పించి 50 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. నేటి బాలలే రేపటి పౌరులని, వారుండాల్సింది పనిలో కాదు బడిలో అన్నారు. బాల కార్మిక వ్యవస్థ వల్ల దేశ భవిష్యత్తు అంధకారంగా మారే ప్రమాదం ఉందన్నారు. ప్రపంచంలో అత్యధిక యువత జనాభా కలిగిన దేశాల్లో భారత్‌ ముందంజలో ఉందన్నారు. ఇప్పటి వరకు రక్షించిన చిన్నారులను చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ ఎదుట హాజరుపరిచి, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ నిర్వహించినట్లు చెప్పారు. సమావేశంలో మెదక్‌ డీఎస్పీ ప్రసన్న కుమార్‌, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్‌ జార్జ్‌, అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌ సతేంద్ర ప్రసాద్‌, విద్యా, వైద్య శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మెదక్‌ కలెక్టరేట్‌: మత్తు పదార్థాల రవాణాను నివారించి సమాజాన్ని కాపాడుదామని కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేట్‌లో ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్‌ నగేశ్‌తో కలిసి మత్తు పదార్థాల నియంత్రణపై సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో యాంటీ డ్రగ్‌, రోడ్డు భద్రత కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. అలాగే పాఠశాలల వద్ద వంద మీటర్ల లోపు పాన్‌షాప్‌లలో గుట్కా లాంటి అమ్మకాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్‌, రెవెన్యూ, వైద్యశాఖల అధికారులు సంయుక్త తనిఖీలు నిర్వహంచి, మత్తు పదార్థాలు, పొగాకు విక్రయాలను నిరోధించాలన్నారు. యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో మత్తు పదార్థాల నివారణకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అంతకుముందు రోడ్డు భద్రతపై జిల్లా అధికారులతో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. మెదక్‌ను జీరో యాక్సిడెంట్‌ జోన్‌గా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. అలాగే జిల్లాలో పర్యాటక అభివృద్ధిపై సమావేశం నిర్వహించారు.

సర్‌కు సహకరించండి

వెల్దుర్తి(తూప్రాన్‌): వెల్దుర్తి మండలంలోని పలు గ్రామాల్లో కొనసాగుతున్న సమగ్ర ఓటరు సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను రాష్ట్ర సాంస్కృతిక శాఖ చైర్‌పర్సన్‌, ఎస్‌ఐఆర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి వెన్నెల పరిశీలించారు. ఈసందర్భంగా సర్వే నిర్వహిస్తున్న బీఎల్‌ఓలతో మాట్లాడి ప్రక్రియ పురోగతిపై ఆరా తీశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. అర్హులు ఓటరు ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునేలా అధికారులు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని సూచించారు. ఇప్పటికే ఓటరు జాబితాలో పేర్లు ఉన్నవారు తమ వివరాలను మరోసారి పరిశీలించుకోవాలన్నారు. గ్రామాల్లో నిర్వహిస్తున్న సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించి సరైన వివరాలను అందించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నేడు మూడు

జిల్లాల కలెక్టర్లతో సమీక్ష

హుస్నాబాద్‌: ఎల్‌నినో ప్రభావం ఎదుర్కొనేందుకు ఆయా శాఖల అధికారులతో నిర్వహించనున్న సన్నాహక సమావేశానికి మూడు జిల్లాల కలెక్టర్లు హాజరు కానున్నట్లు సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ హైమావతి తెలిపారు. నియోజకవర్గంలోని ఏడు మండలాల వివిధ శాఖల అధికారులతో నిర్వహించే సమీక్ష ఏర్పాట్లను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ హైమావతి మాట్లాడుతూ... వివిధ శాఖల అధికారుల యాక్షన్‌ ప్లాన్‌ తెలపడం కోసం ప్రొజెక్టర్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థినుల వసతి కోసం కేటాయించిన రైతు బజార్‌ను పరిశీలించారు. ఆర్డీఓ రామ్మూర్తి, కళాశాల అద్యాపకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement