చేగుంట(తూప్రాన్): భూ సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం భూ రీసర్వే కార్యక్రమం చేపట్టిందని సర్వే అఫ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీఏ కిషన్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. చేగుంట మండలంలోని నాలుగు గ్రామాల్లో భూముల రీసర్వే నిర్వహించి రికార్డులు తయారు చేయనున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో భూములకు సంబంధించిన సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే ఆలోచనతోనే రీసర్వే కార్యక్రమం జరుగనుందన్నారు. రీ సర్వేలో పొందుపరిచిన రికార్డులతో సామాన్య రైతుల భూములకు పూర్తిస్థాయి రక్షణ లభిస్తుందన్నారు. ముందుగా గ్రామానికి సంబంధించిన ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, ఇనాం, ఇతర ప్రభుత్వ సంబంధ భూములను గుర్తిస్తామన్నారు. ప్రజలు, రైతులు పూర్తిస్థాయి సహకారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ స్రవంతి, ఆర్డీఓ బాబయ్య, తహసీల్దార్ బాలలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్, ఉపసర్పంచ్ రఫీ రెవెన్యూ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.


