చిన్నారుల్లో పోషకాహార నివారణకు చర్యలు
● అల్పాహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయం
● త్వరలో జిల్లాలో అమలుకానున్న పథకం
అంగన్వాడీ కేంద్రాల్లో చదువుతున్న చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించడంతో పాటు హాజరుశాతం పెంచడానికి త్వరలో అల్పాహార పథకం అమలు కానుంది. మార్చిలో ‘తొలిముద్ద’ పేరిట సీఎం రేవంత్రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించగా, త్వరలో జిల్లాలో షురూ కానుంది. చిన్నారులకు ఉదయం బ్రేక్ ఫాస్ట్ కింద ఉప్మా, కిచిడీ అందించనున్నారు. – రామాయంపేట(మెదక్)
జిల్లాలోని మెదక్, నర్సాపూర్, అల్లాదుర్గం, రామాయంపేట ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 1,076 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో ఆరు నెలల నుంచి ఆరేళ్లలోపు చిన్నారులతో పాటు బాలింతలు, గర్భిణులు నమోదయ్యారు. కేంద్రాల్లో వీరికి భోజనంతో పాటు ప్రతి రోజూ గుడ్డు, పాలు ఇస్తున్నారు. కాగా, అంగన్వాడీ కేంద్రాల్లో చదువుతున్న చిన్నారులు కొందరు ఇప్పటికే పౌష్టికాహార లోపంతో పాటు ఎత్తుకు తగిన బరువు లేకపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఉదయమే తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళితే చిన్నారులు ఏమి తినకుండానే అంగన్వాడీ కేంద్రాలకు వస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు ఆకలతో ఉండి అస్వస్థతకు గురవుతున్నారు. ఈలోపాన్ని అధిగమించడానికి ప్రభుత్వం తాజాగా అల్పా హారం పథకాన్ని ప్రవేశపెట్టింది. అంగన్వాడీల్లో చదువుకునే ఆరేళ్లలోపు చిన్నారులు శారీరక, మానసిక ఎదుగుదలకు ఈపథకం ఎంతో దోహదపడనుంది. ప్రతి రోజూ ఉదయమే అంగన్వాడీ కేంద్రాలకు వస్తున్న చిన్నారులకు తాజాగా పోషక విలువలున్న ఉప్మాతో పాటు కిచిడీ అందజేస్తారు. దీంతో చిన్నారుల్లో పోషా కాహార లోపాన్ని నివారించవచ్చని ప్రభుత్వం భావిస్తుంది.


