అధికారులను ఆదేశించిన భూ పరిపాలన ప్రధాన కమిషనర్ లోకేష్ కుమార్
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో భూముల రీసర్వే ప్రక్రియ నిర్ధేశిత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర రెవెన్యూ కార్యదర్శి, భూ పరిపాలన ప్రధాన కమిషనర్ డీఎస్ లోకేష్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్, భూభారతి ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు, కలెక్టర్ ప్రతిమాసింగ్, అదనపు కలెక్టర్ నగేశ్, ఏడీ ల్యాండ్ సర్వే కిషన్, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లాలో భూ సర్వే అమలు తీరు, భూభారతి, సాదాబైనామా, రెవెన్యూ సదస్సులు నిర్వహణ సంబంధిత అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 24 గ్రామాలు రీ సర్వేకు ఎంపిక కాగా, 7 గ్రామాల్లో సర్వే పూర్తయిందన్నారు. మరో 18 గ్రామ సభలు నిర్వహించినట్లు చెప్పారు. మిగితా జిల్లాలతో పోలిస్తే మెదక్ జిల్లాలో భూ సర్వే సమర్థవంతంగా నిర్వహించడంపై హర్షం వ్యక్తం చేశారు. సర్వే నిర్వహించేటప్పుడు దారిద్య్రరేఖకు దిగువన ఉన్న నిజమైన భూ లబ్ధిదారులకు న్యాయం చేసే దిశగా రీ సర్వే జరగాలని స్పష్టం చేశారు. గ్రామ సభలు ఏర్పాటు చేసేటప్పుడు డెడ్లైన్ తప్పనిసరిగా పాటించాలన్నారు. భూముల సరిహద్దులు స్పష్టంగా ఉండేందుకు వీలుగా కొత్తగా ల్యాండ్ పార్శిల్ మ్యాప్ నంబర్లను కేటాయిస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ ప్రతిమాసింగ్ మాట్లాడుతూ రీసర్వే అత్యంత ఖచ్చితత్వంతో పూర్తి కావడానికి జిల్లా యంత్రాంగం పటిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తుందని వివరించారు. సమావేశంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


