వెల్దుర్తి(తూప్రాన్): ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీని నియంత్రించాలని ఏబీవీపీ స్టేట్ కో–కన్వీనర్ ప్రశాంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం వెల్దుర్తిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఫీజులు అధికంగా వసూలు చేస్తున్నారని యాజమాన్యాన్ని నిలదీశారు. ఫీజుల మోతకు తోడు అధిక ధరలకు పుస్తకాలు విక్రయిస్తున్నారని ఆరోపించారు. సామాన్య, మధ్య తరగతి విద్యార్థుల తల్లిదండ్రులపై అధిక భారం పడుతుందని వాపోయారు. నిబంధనలకు విరుద్దంగా పుస్తకాలు విక్రయిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఏబీవీపీ నాయకుల సమాచారంతో ఎంఈఓ ఆదేశాల మేరకు కాంప్లెక్స్ హెచ్ఎం సాంబయ్య పాఠశాలలో పుస్తకాలు విక్రయిస్తున్న గదులకు తాళం వేశారు. ఉన్నతాధికారుల ఆదేశానుసారం తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో విభాగ్ హాస్టల్స్ కన్వీనర్ భాను, నాయకులు సిద్దార్థ్ తదితరులు పాల్గొన్నారు.


