
ప్రజా ఆశీర్వాద సభా ప్రాంగణం
నేడు మెదక్లో ప్రజా ఆశీర్వాద సభ
● హాజరుకానున్న సీఎం కేసీఆర్
● ఏర్పాట్లు పూర్తి చేసిన బీఆర్ఎస్ నేతలు
● భారీ జన సమీకరణకు సన్నాహాలు
మెదక్: మెదక్లోని సీఎస్ఐ చర్చి మైదానంలో బుధవారం నిర్వహించే బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద ఎన్నికల సభకు అంతా సిద్ధమైంది. సభకు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను పార్టీ ముఖ్యనేతలు పూర్తి చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం కేసీఆర్ హాజరుకానున్న నేపథ్యంలో భారీ జన సమీకరణకు ప్లాన్ చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డి విజయాన్ని ఆకాంక్షిస్తూ నిర్వహిస్తున్న ఈ ప్రజా ఆశీర్వాద సభకు నియోజకవర్గం నుంచి 50 వేల జనాన్ని తరలించనున్నారు. సభా ప్రాంగణం సమీపంలోనే హెలీప్యాడ్ దిగేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రాంగణంలో సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్రావు, కేటీఆర్లతోపాటు అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డిల కటౌట్లు, హోర్డింగ్లో పెట్టారు. సీఎం సభకు నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి వచ్చే వాహనాలను సభా ప్రాంగణ సమీపంలో గల జూనియర్ కళాశాల గ్రౌండ్, గాంధీనగర్, చర్చి ఎదుట ఖాళీ స్థలాల్లో పార్కింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
మూడు మాసాల్లో రెండోసారి..
మెదక్లోని కొత్త కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయంతోపాటు పార్టీ కార్యాలయాల ప్రారంభోత్సవానికి ఆగస్టు 23న సీఎం కేసీఆర్ మెదక్ వచ్చారు. మూడు మాసాల్లో రెండోసారి. అప్పుడు అధికారికంగా పార్టీ కార్యక్రమాలకు సీఎం హోదాలో రాగా, ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వస్తుండడంతో సభను విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణులు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, ఏర్పాట్లను పార్టీ రాష్ట్ర నాయకుడు దేవేందర్రెడ్డి దగ్గరుండి ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. సభా ప్రాంగణం, వాహనాల పార్కింగ్, వీఐపీలు, పార్టీ శ్రేణులు, ప్రజలు కూ ర్చునే గ్యాలరీలను పరిశీలించి సూచనలు చేశారు.
సభాస్థలిని పరిశీలించిన ఎస్పీ
సీఎం కేసీఆర్ నిర్వహించనున్న ఎన్నికల ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను ఎస్పీ రోహిణీప్రియదర్శినితో పాటు అదనపు ఎస్పీ మహేందర్, పట్టణ సీఐలు పరిశీలించారు. సభా స్థలి పక్కనే హెలీప్యాడ్ కోసం అంతా సిద్ధం చేశారు. సభ నిర్వహించే ప్రాంగణాన్ని అంతా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు.

ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎస్పీ రోహిణీ ప్రియదర్శిని, ఇతర అధికారులు