సారూ.. సమస్యలు పరిష్కరించరూ.. | - | Sakshi
Sakshi News home page

సారూ.. సమస్యలు పరిష్కరించరూ..

Jun 8 2026 11:42 PM | Updated on Jun 8 2026 11:42 PM

● ప్రజావాణిలో దరఖాస్తుల వెల్లువ ● త్వరగా పరిష్కరించాలి ● జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ ● పామాయిల్‌ తోట కోసం డ్రిప్‌ ఇప్పించాలని కన్నెపల్లి మండలం జజ్జరవెల్లి గ్రామానికి చెందిన తాళ్లపెల్లి లక్ష్మణ్‌, తన వ్యవసాయ భూమిలోకి మురుగునీరు రావడంతో సాగు చేయలేకపోతున్నానని, ఇళ్ల మురుగునీరు రాకుండా చర్యలు తీసుకోవాలని బెల్లంపల్లి మండలం బట్వాన్‌పల్లి గ్రామానికి చెందిన కడారి బీరయ్య కోరారు. ● రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని యువజన సమాఖ్య రాష్ట్ర సమితి జిల్లా కార్యదర్శి రవి, ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల ఫీజులు నోటీసు బోర్డులో ప్రదర్శించాలని పీడీఎస్‌యూ ప్రతినిధులు దరఖాస్తు అందజేశారు. ● ఇద్దరు కుమారులు తనతోపాటు భార్య బాగోగులు చూడడం లేదని మంచిర్యాల పట్టణంలోని సుభాష్‌రోడ్‌కు చెందిన సింగరేణి రిటైర్డు ఉద్యోగి జే.శాంతయ్య ఫిర్యాదు చేశారు.

మంచిర్యాలఅగ్రికల్చర్‌: వివిధ సమస్యల పరిష్కారం కోసం జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు సోమవారం కలెక్టరేట్‌కు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. ప్రజావాణిలో కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌కు అర్జీలు అందజేసి సమస్యలు పరిష్కరించాలని కోరారు. కలెక్టర్‌ మాట్లాడుతూ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. కొన్ని శాఖల్లో అర్జీలు పెండింగ్‌లో ఉంటున్నాయని, పరిష్కరించే దిశగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. జిల్లా అదనపు కలెక్టర్లు పి.చంద్రయ్య, వి.రాములు, జిల్లా రెవెన్యూ అధికారి మోతిరామ్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement