మంచిర్యాలఅర్బన్: ప్రైవేట్ పాఠశాలలు ఫీజుల వివరాలను నోటీస్ బోర్డుపై ప్రదర్శించాలని, ఎంఈవోలు పర్యవేక్షించాలని జిల్లా అదనపు కలెక్టర్, డీఈవో చంద్రయ్య సూచించారు. ఈ నెల 15న పాఠశాలలు పునఃప్రారంభం నేపథ్యంలో ఎంఈవో, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం, కేజీబీవీ ప్రత్యేక అధికారులు, మోడల్స్కూల్ ప్రిన్సిపాల్లతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. బడిబాటలో గతేడాది కంటే పదిశాతం అదనంగా విద్యార్థుల నమోదు పెంచాలని తెలిపారు. తరగతి గదులు, ఆవరణ, వంటపాత్రలు శుభ్రం చేయించాలని, మధ్యాహ్న భోజనానికి అవసరమైన బియ్యం సమకూర్చుకోవాలని అన్నారు. పాఠ్య, నోటుపుస్తకాలను పాఠశాలలకు చేరవేయాలని సూచించారు. ప్రతీ విద్యార్థి ప్రాథమిక పాఠశాల నుంచి ఇంటర్మీడియెట్ దశ వరకు నిరాటంకంగా చదువు కొనసాగించేలా చూడాలన్నారు. భవిత సెంటర్లను ఎప్పటికప్పుడు ఎంఈవోలు పర్యవేక్షించాలన్నారు. మధ్యాహ్న భోజనం మొదటి రోజు నుంచే అమలు చేయాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ లలిత, జిల్లా విద్యాశాఖ సెక్టోరల్ అధికారులు భరత్కుమార్, సత్తయ్య, కృష్ణమూర్తి, విజయలక్ష్మి, రాజ్కుమార్ పాల్గొన్నారు.


