మంచిర్యాలక్రైం: నేరాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా కేంద్రంలోని 38, 39, 40, 41, 42, 43, 44, 45 డివిజన్లలో వార్డు సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక పరిస్థితులు, జల్సాల కోసం కొందరు నేర ప్రవృత్తిని ఎంచుకుంటున్నారని అన్నారు. డ్రగ్స్, మద్యానికి అలవాటు పడి మత్తులో నేరాలకు పాల్పడుతున్నారని తెలిపారు. మహిళల భద్రత కోసం పోలీస్ శాఖ ప్రత్యేకంగా షీ టీమ్ పని చేస్తోందని, వేధింపులు, మోసాలకు గురైతే 100 డయల్, షీ టీమ్కు సమాచారం అందించాలని అన్నారు. సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని, చట్టవ్యతిరేక కార్యకలాపాలపై పోలీసులకు సమాచారం అందించాలని, వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. మంచి ర్యాల సీఐ ప్రమోద్రావు, ఎస్సైలు తిరుపతి, శ్రావణ్కుమార్, మధుసూధన్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.


