పాతమంచిర్యాల: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను వ్యతిరేకంగా నిరసనలు చేపట్టనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేన శంకర్ తెలిపారు. సోమవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో జిల్లా, మండల, మున్సిపాలిటీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను పెంచుతూ సామాన్యులపై ఆర్థిక భారం మోపుతోందని, పెరుగుతున్న ధరలను నియంత్రించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఈ నెల 10న కలెక్టరేట్ల ఎదుట ధర్నా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 6 నుంచి 14 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల్లో పాదయాత్రలు నిర్వహిస్తామని, పార్టీ బలోపేతం కోసం ఈ నెల 28, 29, 30వ తేదీల్లో జిల్లా కేంద్రంలో మూడు రోజులపాటు రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీకి పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల దాసు, జోగుల మల్ల య్య, చంద్రశేఖర్, లింగం రవి, శ్రీనివాస్, చంద్రకళ, జిల్లా సమితి సభ్యులు దేవి పోచన్న, బొంతల లక్ష్మీనారాయణ, దుర్గారాజ్, రాజమౌళి, సమ్మయ్య, బానేష్ పాల్గొన్నారు.


