చెన్నూర్: చెన్నూర్ ఎస్బీఐ బ్రాంచ్–2 గోల్డ్లోన్ బాధితులకు ఎట్టకేలకు బంగారు ఆభరణలు అప్పగించే ప్రక్రియను బ్యాంక్ అధికారులు గురువారం నుంచి ప్రారంభించారు. నిజామాబాద్ డీజీఎం విజయభాస్కర్ సాహు, చీఫ్ సెక్యూరిటీ అధికారి (ఏజీఎం) సంజయ్ అప్పజీ, నిజామాబాద్ ఏవో సెక్యూరిటీ అధికారి రాజేశ్యాదవ్, స్థానిక బ్యాంక్ మేనేజర్ రాజేశ్, సీఐ బన్సీలాల్ పర్యవేక్షణలో భారీ పోలీసు బందోబస్తు మధ్య బంగారం తాకట్టుపెట్టి రుణం చెల్లించిన బాధితులకు ఆభరణాలను అప్పగించారు. రోజుకు ఐదుగురికి నగలు ఇచ్చేందుకు అధికారులు అంగీకరించారు. నగలు తాకట్టు పెట్టిన బాధితులు డబ్బులు త్వరగా చెల్లిస్తే పది మందికి ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని బ్యాంక్ అధికారులు పేర్కొన్నారు. బంగారం నగల కేసు కోర్టులో ఉన్నంత కాలం ఎలాంటి అమ్మకాలు చేయడం, కరిగించడం వంటివి చేయనని, గౌరవ న్యాయస్థానం, బ్యాంక్ అధికారులు విధించిన అన్ని షరతులకు లోబడి నగలు నాకు అప్పగించారని, సదరు ఆభరణాలు న్యాయస్థానం, బ్యాంక్ అధికారులు కొరినప్పుడు ఆలస్యం చేయకుండా తీసుకువస్తానని, షరతులకు లోబడి ఉండకుంటే నాపై ఎలాంటి క్రిమినల్ చర్యలైనా, రికవరీ చేసేందుకు బ్యాంక్ అధికారులకు స్వేచ్ఛ ఉంటుందని అఫిడవిట్ బాండ్పై సంతకం చేసిన తర్వాత నగలు అప్పగించారు.


