బెల్లంపల్లి: యువత దురలవాట్లకు దూరంగా ఉండి భవిష్యత్పై దృష్టి సారించాలని డీసీపీ ఎగ్గడి భాస్కర్ అన్నారు. గురువారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా సుభాష్నగర్ బస్తీలో వార్డు సభ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ గంజాయి వినియోగం వల్ల అనేక దుష్పరిణామాలు కలుగుతాయన్నారు. ముఖ్యంగా ఆరోగ్యం, కుటుంబ వ్యవస్థ, భవిష్యత్పై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి మత్తు పదార్థాల వినియోగాన్ని పూర్తిగా నిరోధించాలన్నారు. వేధింపులకు గురైన మహిళలు నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములవ్వాలి
మున్సిపాలిటీలోని 1, 10, 17, 19, 22 వార్డుల్లో వేర్వేరుగా జరిగిన సభల్లో చైర్పర్సన్ దావ స్వాతి మాట్లాడుతూ పట్టణ పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణలో ప్రజలు భాగస్వామ్యం కావాలన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని కమిషనర్ రమేశ్ కోరారు. వన్టౌన్ ఎస్హెచ్వో కె.శ్రీనివాసరావు మాట్లాడుతూ యువకులు సన్మార్గంలో నడవాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతిఒక్కరూ పోలీసు శాఖకు సహకరించాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఏసీపీ కిరణ్కుమార్, టూటౌన్ ఎస్సై సీ.హెచ్.కిరణ్కుమార్, ఆయా వార్డుల కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.


