మంచిర్యాలటౌన్: మంచిర్యాల నగరంలోని మార్కె ట్ ఏరియాలో రోడ్ల వెడల్పు పనులను శ్రీకారం చుట్టారు. పనులు చేపడుతున్నా అనుకున్న సమయంలో పూర్తి చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఫలితంగా వర్షాకాలంలోపు అండర్గ్రౌండ్ డ్రెయినేజీ పనులను పూర్తి చేయడం కష్టంగా మారే అవకాశం ఉంది. రూ.78 కోట్ల నిధులతో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, అండర్గ్రౌండ్ విద్యుత్ వ్యవస్థ, 60 ఫీట్ల రోడ్డు వెడల్పు పనులను చేపడుతున్నారు. శ్రీనివాస థియేటర్ నుండి రైల్వేస్టేషన్ రోడ్డు వరకు దాదాపుగా అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులు పూర్తి అవుతుండగా, మార్కెట్ రోడ్డులోని అర్చన టెక్స్ చౌరస్తా నుంచి మార్కెట్ రోడ్డు ప్రారంభం వరకు చేపడుతున్న అండర్గ్రౌడ్ డ్రెయినేజీ పనుల్లో ఒకవైపు మాత్రమే ఇప్పటికీ పూర్తి చేయగా, మరోవైపు నిర్మాణ పనులు సాగుతున్నాయి. పనుల్లో వేగం పెంచితేనే వర్షాలు కురిసేలోపు అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులను పూర్తి చేసేందుకు అవకాశం ఉండగా, ట్రాఫిక్ ఇబ్బందులు తొలగుతాయి.
రోడ్డు వెడల్పు అయితేనే..
ప్రస్తుతం మార్కెట్ రోడ్డుతో పాటు శ్రీనివాస థియేటర్ నుంచి రైల్వేస్టేషన్ మీదుగా బెల్లంపల్లి చౌరస్తా వరకు రోడ్డు వెడల్పు పనులు చేపడుతున్నారు. నెల రోజులకు పైగా పనులతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ఏ రోడ్డు ఎప్పుడు మూసి ఉంటుందో, ఎటువైపు నుంచి రాకపోకలు సాగించాలో వాహనదారులకు తెలియని పరిస్థితి. దీంతో రోడ్డు వెడల్పు పనులు పూర్తయ్యే వరకు దుకాణాల యజమానులు, ప్రజలు సహకారం అందిస్తున్నా వర్షాలు కురిస్తే మాత్రం మరింత ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ కోసం తవ్విన గుంతల్లో వర్షపు నీరు నిలిస్తే పనులు నిలిచిపోయే అవకాశం ఉంది. అండర్గ్రౌండ్ డ్రెయినేజీ పూర్తి చేసిన చోట రోడ్డు వెడల్పు పనులను చేపడితేనే వాహనదారులకు, దుకాణదారులకు ఇబ్బంది తొలగనుంది. రోడ్డు వెడల్పు పనులన్నీ పూర్తి చేసేందుకు కొంత సమయం తీసుకున్నా, భవిష్యత్లో మాత్రం ప్రజలకు రోడ్ల వెడల్పు ఎంతగానో ఉపయోగపడనుంది. ట్రాఫిక్ సమస్యలు తీరడంతో పాటు, వాహనాల పార్కింగ్ సమస్య రోడ్ల వెడల్పుతో
తీరనుంది.


