పోరుగడ్డకు సీఎం | - | Sakshi
Sakshi News home page

పోరుగడ్డకు సీఎం

Jun 1 2026 7:29 AM | Updated on Jun 1 2026 7:29 AM

నేడు కుమురంభీం జిల్లాలో రేవంత్‌రెడ్డి పర్యటన

కొత్తగూడలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం

కాగజ్‌నగర్‌ ఎక్స్‌రోడ్‌ వద్ద బహిరంగ సభ

ఏర్పాట్లు పరిశీలించిన ప్రజాప్రతినిధులు, అధికారులు

రెబ్బెన: పోరుగడ్డ కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాకు తొలిసారి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రానున్నారు. గతనెలలో తుమ్మిడిహెట్టి పర్యటన దాదాపు ఖరారైనా చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం కెరమెరి మండలం కొత్తగూడలో నూతనంగా నిర్మించిన 25 ఇందిరమ్మ గృహాల ప్రారంభోత్సవంతోపాటు కాగజ్‌నగర్‌ ఎక్స్‌రోడ్‌ వద్ద నిర్వహించే బహిరంగ సభకు ముఖ్యమంత్రి హాజరుకానున్నారు. కాంగ్రెస్‌ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరును ఇక్కడి నుంచే ప్రారంభించనున్నారు.

పర్యటన ఇలా..

సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం సాయంత్రం 4.30 గంటలకు ఆయన నివాసం నుంచి డాక్టర్‌ ఎంసీఆర్‌ హెచ్‌ఆర్డీ వద్ద ఉన్న హెలిప్యాడ్‌ ప్రాంతానికి బయలుదేరుతారు. 4.40 గంటలకు హెలిక్యాప్టర్‌ ద్వారా 5.45 గంటలకు కెరమెరి మండలం కొఠారి పంచాయతీకి చేరుకుంటారు. 5.50 నుంచి 6.30 వరకు కొత్తగూడలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం, రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించి లబ్ధిదారులతో మాట్లాడుతారు. 6.55 గంటలకు రోడ్డు మార్గం ద్వారా కాగజ్‌నగర్‌ ఎక్స్‌రోడ్‌ వద్ద ఏ ర్పాటు చేసిన బహిరంగ సభ వద్దకు చేరుకుంటారు. రాత్రి 7గంటల వరకు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. 8.30గంటల వరకు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 8.30గంటలకు రోడ్డు మార్గం ద్వారా కాగజ్‌నగర్‌కు చేరుకుంటారు. వి శ్రాంతి తీసుకుని 9.15 గంటలకు రోడ్డు మార్గం ద్వారా మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌ నివాసానికి వెళ్తారు. రాత్రి 10 గంటలకు రోడ్డు మా ర్గం ద్వారా హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్తారు.

భారీగా జనసమీకరణ..

సీఎం రేవంత్‌రెడ్డి తొలిసారి జిల్లాకు రానుండటంతో కాంగ్రెస్‌ శ్రేణులు భారీగా జనసమీకరణకు సిద్ధమవుతున్నారు. మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాల నుంచి ప్రజలను తరలించనున్నారు. దాదాపు లక్ష మంది హాజరు అవుతారని అంచనా వేస్తున్నారు. సీఎం సభ కన్వీనర్‌, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు, ఎమ్మెల్సీ దండె విఠల్‌, డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ జనాన్ని సమీకరించేందుకు సన్నాహాలు చేశారు.

ఏర్పాట్లు పరిశీలన

ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం కెరమెరి మండలం కొఠారి పంచాయతీలోని కొత్తగూడతోపాటు కాగజ్‌నగర్‌ ఎక్స్‌రోడ్‌ వద్ద నిర్వహించే బహిరంగ సభ వద్ద ఏర్పాట్లను ఎమ్మెల్సీ దండె విఠల్‌, కలెక్టర్‌ హరిత, ఎస్పీ నితిక పంత్‌, డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణతో కలిసి పరిశీలించారు. అలాగే బందోబస్తు ఏర్పాట్లను మల్టీజోన్‌ వన్‌ ఐజీ చంద్రశేఖర్‌ పరిశీలించారు. హెలిప్యాడ్‌ ప్రాంతం, ఇళ్ల శంకుస్థాపన ప్రాంతాలను పరి శీలించి కలెక్టర్‌, ఎస్పీలకు సూచనలు చేశారు. ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు సైతం ఆయా ప్రాంతాల్లో ఏర్పాట్లను పరిశీలించారు.

Advertisement
 
Advertisement
Advertisement