భీమిని: కన్నెపల్లి మండల కేంద్రానికి చెందిన చెండే కమల– బాపు వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వీరికి అంజన్న, రాజు సంతానం. పెద్ద కుమారుడు అంజన్న స్థానిక జెడ్పీ పాఠశాలలో పదో తరగతి, బెల్లంపల్లిలో ఇంటర్ పూర్తి చేశాడు. తల్లిదండ్రుల కష్టాన్ని చూస్తూ పెరిగిన అంజన్న సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలన్న సంకల్పంతో జగిత్యాలలో నెలరోజుల శిక్షణ పొందాడు. ఉద్యోగ సాధనే లక్ష్యంగా ప్రయత్నించాడు. ఇటీవల ప్రకటించిన అగ్నివీర్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు.
వ్యవసాయం చేస్తూ..చదివించి
పెంబి: మండలంలోని మందపల్లి గ్రామానికి చెందిన నారకట్ల మమత–రమేశ్ యాదవ్ దంపతుల కుమారుడు రఘవీర యాదవ్, బొజ్జ శంకరమ్మ– భీమన్న దంపతుల కుమారుడు మణికంఠ అగ్నివీర్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. వారి తల్లిదండ్రులు వ్యవసాయ పనులు చేసుకుంటూ కుమారులను చదివించారు. సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలన్న సంకల్పంతో ఇటీవల ప్రకటించిన అగ్నివీర్ జనరల్ డ్యూటీ కేటగిరీ ఫలితాల్లో తమ కల సాకారం చేసుకున్నారు.


