మున్సిపల్ పీఠంపై కాంగ్రెస్ కుట్రలు
రామకృష్ణాపూర్: క్యాతనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్ర రాజకీయాలకు పాల్పడుతోందని సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ ఆరోపించారు. చైర్పర్సన్ ఎన్నికల సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత బాధాకరమని, మంత్రి కనుసన్నల్లో పోలీస్ యంత్రాంగం పనిచేసిందని విమర్శించారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల నియమావళి పేరిట కేవలం బీఆర్ఎస్, సీపీఐ నాయకులను వేధించటం సరికాదని పేర్కొన్నారు. సీపీఐ, బీఆర్ఎస్ కలిసి 14 మంది కౌన్సిలర్లు గెలువగా ఈ రెండు పార్టీల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటన్నారు. చైర్పర్సన్ ఎన్నికల సందర్భంగా సీపీఐ, బీఆర్ఎస్ కౌన్సిలర్లు పదవుల కోసం గొడవపడ్డారని మంత్రి వివేక్ చెప్పడం ఏమాత్రం సరికాదని, ఆ రోజు సీసీ ఫుటేజీలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు ఇప్పకాయల లింగయ్య, మిట్టపెల్లి పౌల్, దుర్గరాజ్, వనం సత్యం, నక్క వెంకటస్వామి, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.


