
కంటెయినర్ ఢీకొని యువకుడి మృతి
● రాఖీ కట్టించుకొని ఇంటికి వస్తుండగా ప్రమాదం ● బాసరలో పండుగపూట విషాదం
బాసర/నవీపేట: రాఖీ పండుగను పురస్కరించుకుని ఓ సోదరుడు అక్కతో రాఖీ కట్టించుకొని స్కూటీపై తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లిన ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం అబ్బాపూర్(ఎం) శివారులో చోటు చేసుకుంది. ఎస్సై వినయ్ తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా బాసరకు చెందిన వర్గంటి సాయినాథ్, కవిత దంపతులకు కుమార్తె సాయిప్రియ, కుమారుడు సాయిబాబు అలియాస్ బబ్లూ (19) ఉన్నారు. రాఖీ పండుగ సందర్భంగా శనివారం బబ్లూ నిజామాబాద్లోని గాజుల్పేట్లో ఉంటున్న కవిత వద్దకు చిన్నాన్న కుమారుడైన అరవింద్తో కలిసి స్కూటీపై వెళ్లాడు. అక్కతో రాఖీ కట్టించుకొని తిరిగి వస్తుండగా అబ్బాపూర్(ఎం)–జగ్గారావు ఫారమ్ మధ్యలో ముందుగా వెళ్తున్న కంటెయినర్ను ఓవర్ టేక్ చేస్తూ వెనుక నుంచి ఢీకొన్నారు. ఈ ఘటనలో బబ్లూ కిందపడిపోవడంతో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. అరవింద్కు స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించడంతో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి మేనమామ బలగం రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.