
● సెటిల్మెంట్లు, వసూళ్ల దందాపై పోలీస్ బాస్ సీరియస్
పోలీస్ శాఖ ప్రతిష్ట కాపాడేలా..
పోలీస్ శాఖకు అప్రతిష్ట తెచ్చే వారిపై ఇంటలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ విభాగాల ద్వారా నిఘా ఉంచారు. ఈ విభాగాలు సేకరించిన సమాచారం సీపీకి అందుతోంది. చాపకింద నీరులా విచారణలు సాగుతున్నాయి. శాఖ ప్రతిష్టను కాపాడేందుకు నిరంతర నిఘా కొనసాగుతోంది. ఇటీవల ముగ్గురు పోలీసు ల సస్పెన్షన్ జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. క్రమశిక్షణ, నిబద్ధత, జవాబుదారీతనంతో పనిచేయాలని సీపీ అంబర్ కిషోర్ ఝా పదేపదే హెచ్చరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పోలీస్ స్టేషన్లు, సమస్యాత్మక ప్రాంతాలను పర్యటించి, ఒకే చోట దీర్ఘకాలం పనిచేస్తున్న వారిని బదిలీ చేస్తూ, అక్రమాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు.
మంచిర్యాలక్రైం: పోలీస్.. అంటే నాటులో సింహం.. ఈ కనిపించని కొందరు నాలుగో సింహాలు.. గాడితప్పుతున్నారు. పోలీస్ పవర్ ఉపయోగించి సెటిల్మెంట్లు, వసూళ్ల దందాలకు పాల్పడుతున్నారు. భూకబ్జాలు చేస్తున్నారు. పోలీస్ శాఖకు మచ్చ తెస్తున్నారు. ఇలాంటి వారిపై రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా కొరడా ఝళిపిస్తున్నారు. కఠిన చర్యలతో క్రమ‘శిక్ష’ణ నేర్పుతున్నారు. అప్రతిష్ట తెచ్చే అధికారులపై తీసుకుంటున్న చర్యలు ఇప్పడు ఆ శాఖలో కలకలం రేపుతున్నా యి. ఫిర్యాదు అందిన వెంటనే క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, శాఖాపరమైన చర్యలు చేపడుతుండడంతో పోలీసుల్లో గుబులు మొదలైంది. అక్రమాలకు పాల్పేందుకు జంకుతున్నారు. ఇక గతంలో పోలీసులపై ఫిర్యాదు చేయడానికి జంకిన బాధితులు ఇప్పుడు నేరుగా కమిషనర్ను సంప్రదించి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఫిర్యాదులపై సత్వర విచారణ, చర్యల కారణంగా కమిషనరేట్ పరిధిలో అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందిపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
జైపూర్ పోలీస్ స్టేషన్లో వరుస ఘటనలు..
జైపూర్ పోలీస్ స్టేషన్లో జరిగిన ఘటనలు శాఖలో చర్చనీయాంశంగా మారాయి. ఓ హెడ్ కానిస్టేబుల్ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ, అదే మహిళతో పరిచయం ఉన్న ఓ హోం గార్డ్పై కక్ష పెంచుకున్నాడు. ఈ కక్షతో హోంగార్డ్పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో అతన్ని సస్పెండ్ చేశారు. అయితే, హోంగార్డ్ కుటుంబ సభ్యులు అసలు విషయం ఉన్నతాధికారులకు తెలియజేయడంతో, విచారణ జరిపి హెడ్ కానిస్టేబుల్ను కూడా సస్పెండ్ చేశారు. అదే స్టేషన్లో మరో కానిస్టేబుల్, మహిళా కానిస్టేబుల్ను వేధించి, అసభ్యకరమైన సందేశాలు పంపడంతో, బాధితురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో కాని స్టేబుల్ను సీపీ సస్పెండ్ చేశారు. ఒకే పోలీస్ స్టేషన్లో వరుస ఘటనలు శాఖలో కలకలం రేపాయి.
అవినీతి, అక్రమాలపై నిఘా..
పోలీస్ శాఖలో అవినీతి, వివాహేతర సంబంధాలు, భూ సెటిల్మెంట్లు, అక్రమ వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్న పోలీసులపై సీపీ నిఘా పెట్టారు. క్రైం మీటింగ్లలో క్రమశిక్షణ, ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వక వ్యవహారం, శాఖకు మచ్చ తెచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. మంచిర్యాల, దండేపల్లి, బెల్లంపల్లి, చెన్నూర్, కోటపల్లి పోలీస్ స్టేషన్లలో రాజకీయ అండదండలతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న కొందరు ఎస్సైలు, సీఐలు, కానిస్టేబుళ్లపై క్షేత్రస్థాయిలో విచారణ జరుగుతోంది. స్థానిక ప్రజాప్రతినిధులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కలిసి సెటిల్మెంట్లు చేస్తున్నవారి జాబితా సిద్ధం చేసినట్లు సమాచారం. పంచాయతీ ఎన్నికల ముందు వీరిపై బదిలీ వేటు, శాఖాపరమైన చర్యలు తప్పవని తెలుస్తోంది.
క్రమశిక్షణ తప్పితే కఠిన చర్యలు
పోలీస్ శాఖ అంటేనే క్రమశిక్షణకు మారుపేరు. ఎవరైనా క్రమశిక్షణ ఉల్లంఘిస్తే వా రు ఎంతటి వారైనా.. శాఖపరమైన చర్యలు తప్పవు. పోలీసులు ప్రజలకు జవాబు దారీగా, మార్గదర్శకంగా ఉండాలి. పోలీస్ శాఖలో ప్రక్షళన చేస్తున్నాం. చట్టానికి పోలీసులు అతీతులు కారు. నేరం చేస్తే శిక్ష తప్పదు.
– ఎగ్గడి భాస్కర్, డీసీపీ, మంచిర్యాల

● సెటిల్మెంట్లు, వసూళ్ల దందాపై పోలీస్ బాస్ సీరియస్