
ఆటలకు వేళాయె..
● ఈ నెల చివరిలో ఎస్జీఎఫ్ పోటీల నిర్వహణ ● వేదికలు ఖరారు
మంచిర్యాలఅర్బన్: విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా ముఖ్యమేనని భావించిన రాష్ట్ర ప్రభుత్వం బాలబాలికలు క్రీడల్లో రాణించేలా ఏటా ఎస్జీఎఫ్ (స్కూల్ గేమ్ ఫెడరేషన్) పోటీలు నిర్వహిస్తోంది. ఈ ఏడాది కూడా ఆగస్టులో నిర్వహించడానికి సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా క్రీడల నిర్వహణకు సంబంధించిన వేదికలను కూడా ప్రకటించింది. పోటీలను మూడంచెల పద్ధతిలో నిర్వహించనున్నారు. అండర్–14, 17 విభాగంలో పాఠశాలల విద్యార్థులకు మండల, జోనల్, జిల్లా స్థాయిలో విడతల వారీగా పోటీలు తలపెట్టనున్నారు. జిల్లాస్థాయిలో జరిగే పోటీల నిర్వహణకు వేదికలతో పాటు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుడు, ప్రిన్సిపాళ్లను కన్వీనర్లుగా ప్రకటించారు. జోనల్, స్టేట్మీట్ వేదికలు ఖరారు కావాల్సి ఉంది. ముందుగా అన్ని మండలాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ కనబర్చిన వారిని జిల్లా స్థాయికి ఎంపిక చేస్తారు. అక్కడి నుంచి జోనల్, రాష్ట్ర, జాతీయ స్థాయికి ఎంపిక చేస్తారు.
క్రీడా పోటీలు ఇలా..
జిల్లా స్థాయిలో నిర్వహించే క్రీడా పోటీలకు వేదికలు ప్రకటించారు. అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్ పోటీలు (జెడ్పీహెచ్ఎస్ భీమారం), బాక్సింగ్ (మోడల్స్కూల్, రాజీవ్నగర్), రెజ్లింగ్ (మధర్థెరిస్సా స్కూల్, మంచిర్యాల), టెన్నిస్ (జెడ్పీహెచ్ఎస్, నెన్నెల), బాస్కెట్ బాల్ (కార్మెల్ హైస్కూల్, మంచిర్యాల), చదరంగం (జెడ్పీహెచ్ఎస్, ఆకెనపల్లి), కబడ్డీ, అండర్–17 (ట్రినిటీ హైస్కూల్), అండర్–14, 17 (జెడ్పీహెచ్ఎస్, అచ్చలాపూర్), టేబుల్ టెన్నిస్ (జెడ్పీహెచ్ఎస్, ముల్కల్ల), వాలీబాల్, అండర్–17 బాలురు (జెడ్పీహెచ్ఎస్, జన్నారం), వాలీబాల్ అండర్–17 బాలికలు (లక్సెట్టిపేట్), వాలీబాల్ అండర్ 14, 17, బాలురు, బాలికలు (జెడ్పీహెచ్ఎస్, రెబ్బనపల్లి), ఉషూ, హ్యాండ్బాల్, అండర్–17 (సదన డిఫెన్స్ అకాడమి, మంచిర్యాల), త్రోబాల్ (జెడ్పీహెచ్ఎస్, కన్నెపల్లి), హ్యాండ్బాల్, అండర్–14 (జెడ్పీహెచ్ఎస్, నస్పూర్), బాస్కెట్బాల్ (జెడ్పీహెచ్ఎస్, బెల్లంపల్లి), పెన్సింగ్ (స్పింగ్ ఫీల్డ్ స్కూల్, మంచిర్యాల), ఖోఖో (జెడ్పీహెచ్ఎస్, భీమారం), సాఫ్ట్బాల్ (జెడ్పీహెచ్ఎస్, బెల్లంపల్లి), లాన్టెన్నిస్, టెన్నికాయిట్ (జెడ్పీహెచ్ఎస్, నెన్నెల) టగ్ ఆఫ్ వార్ (ఆక్స్ఫర్డ్ స్కూల్, మంచిర్యాల), క్రికెట్ (ట్రినిటీ హైస్కూల్, పల్లవి మోడల్ స్కూల్ మంచిర్యాల), ఫుట్బాల్ (హెవెన్ ఆఫ్ హోప్ స్కూల్)లో పోటీలు నిర్వహించనున్నారు. ఇతర క్రీడాపోటీలకు వేదికలు కేటాయించాల్సి ఉంది. పోటీల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆగస్టు చివరలో పోటీలు నిర్వహించనున్నట్లు ఎస్జీఎఫ్ జిల్లా సెక్రెటరీ మహ్మద్ యాకూబ్ తెలిపారు. పోటీలకు సంబంధించి వేదికలు ఖరారు చేశామని, కన్వీనర్లను కూడా నియమించినట్లు ఆయన పేర్కొన్నారు.