
వన్యప్రాణులను వేటాడితే కఠిన చర్యలు
● ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్టౌన్: వన్యప్రాణులను వేటాడితే కఠిన చర్యలు తప్పవని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. మంగళవారం పట్టణంలోని వన్టౌన్ పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వన్యప్రాణుల వేటగాళ్ల కోసం జిల్లా వ్యాప్తంగా పది ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపట్టి నాలుగు కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. నిందితుల నుంచి ఒక డబుల్ బోర్గన్, ఒక ఎయిర్గన్, జింక కొమ్ములతో కూడిన తల, రెండు జింక కొమ్ములు, కత్తులు, టార్చ్లైట్లు, వేట సామగ్రి, వైర్లు, బరిసెలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఆదిలాబాద్ వన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 1, మావల పోలీసు స్టేషన్లో 2, తాంసి పోలీసు స్టేషన్ పరిధిలో 1 కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వన్టౌన్ పోలీసు స్టేషన్లో ఆదిలాబాద్ పట్టణంలోని పంజేషా మొహల్లాకు చెందిన షోయబ్ అఫ్జల్ వద్ద ఒక డబుల్ బోర్గన్, జింక తల, రెండు జింక కొమ్ముల ముక్కలు, వేటకు ఉపయోగించిన సామగ్రి, కత్తులు, జాకెట్లు, షూలు లభించినట్లు చెప్పారు. మావల మండలంలోని వాగాపూర్కు చెందిన ఆత్రం మారుతి, ఆత్రం భీంరావు వద్ద 50 మీటర్ల జేవైర్, నైలన్ మెష్, జంతువులను వేటాడే సామగ్రి, ఒక ఈటె, ఎలక్ట్రిక్ వైర్ లభించినట్లు తెలిపారు. తాంసి మండలంలోని ఘోట్కురికి చెందిన షేక్ షరీఫ్ వద్ద ఎయిర్గన్ లభించినట్లు పేర్కొన్నారు. వారిపై ఆయా పోలీసుస్టేషన్లలో కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. సమావేశంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి, వన్టౌన్ సీఐ సునీల్ కుమార్, మావల సీఐ కర్రె స్వామి, ఎస్సై ఇసాఖ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.